YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు  లో ఆరెస్ట్ అయినా కడప ఎంపీ అవినాష్ రెడ్డి  తండ్రి భాస్కర్ రెడ్డి   బెయిల్ పిటిషన్‌  పై మంగళవారం సీబీఐ కోర్టు లో విచారణ జరింగి.  భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయకూడదని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కాగా భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు వాదనలు వినిపించారు.  భాస్కర్ రెడ్డి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును న్యాయవాది ప్రస్తావించారు.  వివేకా హత్య కేసులో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని సీబీఐ అధికారులు ఆరెస్ట్ చేశారని న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు అన్నారు. 


లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని సునీత లాయర్‌కు కోర్టు ఆదేశం


ఆరోపణలు మాత్రమే సీబీఐ పరిగణలోకి తీసుకుందని, భాస్కర్ రెడ్డి సమాజంలో పలుకబడి ఉన్న వ్యక్తి అని, ఒక సీనియర్ సిటిజన్‌ను అక్రమ కేసులో ఇరికించారన్నారు. ఎలాంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి అని, ఆయన నేరం చేశారనడానికి ఎక్కడా సరైన సాక్ష్యాలు లేవన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి పేరు ప్రస్థావించలేదని అన్నారు. ఈ కేసు విషయంలో ఇంప్లీడ్ అయ్యేందుకు గతంలో వైఎస్ సునీత పిటిషన్ దాఖలు చేశారు. సునీత ఇంప్లీడ్ పిటిషన్ ను న్యాయమూర్తి అంగీకరించారు. అయితే లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలన్నారు. తదుపరి విచారణను తొమ్మిదో తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. 


ఇప్పటికే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్                             


అవినాష్ రెడ్డిని  సీబీఐ అరెస్ట్ చేయకుండా  తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఇందు కోసం నాలుగు షరతులు పెట్టింది. పూచీకత్తులతో పాటు ప్రతి శనివారం విచారణకు హాజరు కావాలని.. చెప్పకుండా విదేశాలకు వెళ్లవద్దని  షరతులు పెట్టింది.  వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మందుస్తు బెయిల్ మంజూరు అయింది.  అరెస్టు చేసిన‌ట్లు అయితే రూ. 5 ల‌క్ష‌ల పూచీక‌త్తుతో బెయిల్‌పై విడుద‌ల‌కు సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు ప్ర‌తి శ‌నివారం ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సీబీఐ ఎదుట హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. సీబీఐకి అవ‌స‌ర‌మైన‌ప్పుడు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.


న్యాయపోరాటం చేస్తున్న వైఎస్ వివేకా కుమార్తె సునీత                      


మరో వైపు తండ్రిని చంపిన వారికి శిక్ష పడేంత వరకూ వదిలి పెట్టబోనని న్యాయపోరాటం చేసేందుకు వైఎస్ సునీత సిద్ధమయ్యారు. గంగిరెడ్డి  బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాల్ చేసి..బెయిల్ రద్దు చేయించారు. ప్రస్తుతం భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ లోనూ ఇంప్లీడ్ అయ్యారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై  సుప్రీంకోర్టులోనూ వెకేషన్ బెంచ్ విచారణలు జరుగుతున్నందున .. సెలవులు అయిపోయిన తర్వాత అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ తీర్పును సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు