Phone Tapping Issue :    తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో వేడిని బీజేపీ అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్గొంటున్న తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని  బీజేపీ రాష్ట్ర ఇంఛార్జి తరుణ్‌చుగ్‌ ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్‌ సహా నగదు లావాదేవీల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మునుగోడు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నారని..  ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు లావాదేవీలపై విష ప్రచారం చేస్తున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు.   బీజేపీపై ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ స్వయంగా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మునుగోడు ఓటర్లకు డబ్బు పంపుతోందని చుగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 


ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఈసీకి తరుణ్ చుగ్ ఫిర్యాదు


టీఆర్‌ఎస్‌ కోసం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని చుగ్ ఎన్నికల సంఘాన్ని కోరారు.మరో వైపు  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోషల్ యాక్టివిస్ట్ తంగెళ్ల శివప్రసాద్ రెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలతో పాటు సామాన్యుల ఫోన్లను కూడా తెలంగాణ ప్రభుత్వం టాప్ చేస్తోందని వివరించారు. 


హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తంగెళ్ల శివప్రసాద్


రాష్ట్ర హోం శాఖ సెక్రటరీ, డీజీపీ, సైబరాబాద్ సీపీని బాధ్యులుగా చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.  ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 5 (2) నిబంధనలను ఉల్లంఘించి.. ప్రజల వ్యక్తిగత వివరాలను ట్యాపింగ్ చేస్తున్నారని శివప్రసాద్ ఆరోపించారు. ఫోన్ ట్యాప్ చేయడం‭తోనే ఫామ్ హౌస్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణను డిమాండ్ చేస్తూ బీజేపీ వేసిన పిటిషన్‭తో కలిపి.. నవంబర్ 4న విచారణ జరుపుతామని  తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మరో వైపు  తంగేళ్ల శివ ప్రసాద్‌రెడ్డి  సోమవారం ఢిల్లీలో  ఎమ్మెల్యేలు, సామాన్యుల ఫోన్‌లను తెలంగాణ సర్కార్‌ ట్యాప్ చేస్తోందని ఈసీకి ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదును ఎన్నికల కమిషన్ స్వీకరించింది. 


బ్యాంక్ అకౌంట్లను కూడా రహస్యంగా చూస్తున్నారని బీజేపీ ఆరోపణ 


భారతీయ జనతా పార్టీ నేతలు ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్‌ చేస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తోందని.. బ్యాంక్ అకౌంట్ల వివరాలను కూడా సేకరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. గతంలో దుబ్బాక ఉపఎన్నికల సమయంలోనూ .. తెలంగాణ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తోందని.. ఆయన హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అయితే ఈ లేఖలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ట్యాపింగ్‌పై విచారణ జరగలేదు. ఇప్పుడు తంగెళ్ల శివప్రసాద్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం,హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నదానిపై కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.