Talasani :   బీఆర్ఎస్ కు  ఏ పార్టీతో పొత్తు ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కు పూర్తి మెజార్టీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే లెఫ్ట్ పార్టీలతో కలిసి పని చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ప్రకటన చేయడంతో గందరగోళం ఏర్పడింది. దీనపైనా తలసాని స్పందించారు. వామపక్షాల పొత్తు విషయంలో సీఎం మాట్లాడతారని తెలిపారు. బీఆర్ఎస్ ఏ రాజకీయ పార్టీపై ఆధారపడదన్నారు. కోమటిరెడ్డి ప్రకటన అనంతరం...  బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు అంటూ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లపై తలసాని స్పందించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.                             


కోమటిరెడ్డి వెంకటరెడ్డి గంటకో మాట మాట్లాడుతున్నారని, మాటల్లో విశ్వసనీయత లేదన్నారు. వెంకటరెడ్డి పొద్దున ఒక మాట.. సాయంత్రం మరో మాట మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌తో పొత్తు అనే మాటే లేదని, బీఆర్ఎస్ పార్టీకి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ బలమైన, తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు. కోమటిరెడ్డి స్టాండర్డ్స్‌ లేని వ్యక్తి అని, ఆయన వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై వాళ్ల పార్టీ నేతలు ఏం అంటున్నారో ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్ లో ఎంపీగా ఉండి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీకి ఓట్లు వేయమన్నారన్నారు.                                            


పార్టీలు మారిన వాళ్లు.. బీఆర్ఎస్‌ను వీడిన వాళ్లు ఎలా ఉన్నారో ప్రజలు చూస్తున్నారన్నారు. నోరుంది కదా? అని తాడు బొంగురం లేకుండా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. కిషన్‌రెడ్డి అంబర్‌పేట, సికింద్రాబాద్‌లో చేసిన అభివృద్ధి గురించి చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంబర్‌పేటలో చేసిన అభివృద్ధిపై అంబర్‌పేట ఎమ్మెల్యే రెడీగా ఉన్నారన్నారు. ఏళ్లుగా ఎమ్మెల్యేగా అంబర్‌పేటకు కిషన్ రెడ్డి ఉన్నారని, అభివృద్ధిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చర్చకు సిద్ధమని, కిషన్ రెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లోకి వస్తారా? లేదా? అనేది ఆయనకే తెలియాలన్నారు.                       


బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎవరిపై ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేయదని, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా ఉందన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభానికి జగన్మోహన్ రెడ్డికి కేంద్రం అనుమతి ఇచ్చిందని, మా సెక్రటేరియట్ ప్రారంభానికి ఇవ్వలేదన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వ్యవస్థను ఎలా నడుపుతోందో దేశం అంతా గమనిస్తోందన్నారు. సెక్రెటేరియట్‌ కట్టడం చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారన్నారు. సెక్రెటేరియట్‌ కట్టడం గొప్పతనం భవిష్యత్‌లో అందరికీ తెలుస్తుందన్నారు.