తెలంగాణలో ఎంసెట్ పరీక్ష బుధవారం (ఆగస్టు 4న) ఉదయం ప్రారంభమైంది. కరోనా నిబంధనల వల్ల ఎంసెట్ పరీక్షను వివిధ తేదీల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి 5, 6 తేదీలు.. మళ్లీ 9, 10 తేదీల్లో ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంకా మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ కూడా ఎంసెట్ పరీక్ష జరగనుంది. తొలి మూడు రోజులు ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాలకు, ఈ నెల 9, 10 తేదీల్లో మెడిసిన్, వ్యవసాయ సబ్జెక్టుల కోసం ఎంసెట్ పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ పరీక్షల నిర్వహణ కోసం కొవిడ్19 నిబంధనలను అనుసరించి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లుగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి విలేకరులకు తెలిపారు.


అయితే, ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఎప్పటిలాగే ‘ఒక నిమిషం’ నిబంధనను అమలు చేస్తున్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. విద్యార్థులను గంట ముందు నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు.
 
పరీక్షా నిబంధనలు ఇవీ.. 
కొవిడ్19 వ్యాప్తి కొనసాగుతున్నందున ఎంసెట్ పరీక్షల నిర్వహణలోనూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రతి విద్యార్థి తనకు ఎలాంటి లక్షణాలు లేవని తెలుపుతూ సెల్ఫ్ డిక్లరేషన్‌ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికైనా జ్వరం, జలుబు వంటివి లక్షణాలు ఉంటే వారికి ఆఖరి రోజున పరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి తప్పకుండా విధిగా మాస్క్‌ ధరించాల్సి ఉంటుంది.


పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ దుస్తులను మాత్రమే ధరించాలి. జర్కిన్లు, స్వెటర్లు వంటివి ధరించకూడదు. మహిళా విద్యార్థినులు తప్పనిసరిగా హాఫ్ స్లీవ్స్ ఉండే దుస్తులు మాత్రమే ధరించి పరీక్షా కేంద్రానికి రావాలి. తమ వెంట బాల్‌ పాయింట్‌ పెన్, హాల్‌టికెట్‌ కచ్చితంగా తెచ్చుకోవాలి. పరీక్షా కేంద్రంలో భౌతిక దూరం ప్రకారమే ఆన్‌ లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుంది.


విద్యార్థులు పరీక్షా కేంద్రం ప్రవేశం వద్ద నిర్దేశించిన సర్కిల్స్‌లో మాత్రమే నిలబడాలి. వారు తమ వెంట హ్యాండ్ శానిటైజర్లు, గ్లౌజులు, పెన్ను, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే నీళ్ల సీసా మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మిగతా వాటికి అనుమతి లేదు.


ఎంసెట్‌ పరీక్షకు మార్కులు 160 కాగా జనరల్‌ కేటగిరీ అభ్యర్థుల అర్హత సాధించాలంటే కనీసం 40 మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆ అర్హత మార్కుల పరిమితి ఉండదు. బాలికలకు 33 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. పరీక్షాపత్రం ఆంగ్లం - తెలుగు, ఆంగ్లం - ఉర్దూ, ఆంగ్ల భాషల్లో ఉంటుంది. విద్యార్థులు దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం ఈ మూడింటిలో ఏదో ఒక కేటగిరీ భాషల్లో పరీక్షాపత్రాన్ని అందిస్తారు.