TSRTC Charges Hike : టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు షాకిచ్చింది. మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలను పెంచింది. ఈ ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. డీజిల్ ధర పెంపు కారణంగా ఆర్టీసీ డీజిల్ సెస్ విధించింది. పల్లెవెలుగు, ఆర్డినరీ, సిటీ బస్సుల్లో టికెట్‌పై రూ. 2 చొప్పున అదనంగా సెస్ వసూలు చేస్తారు. ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, ఎయిర్ కండిషన్ బస్సుల్లో అదనంగా రూ. 5 వసూలు చేయనున్నారు. డీజిల్ బల్క్ గా కొనుగోలు చేస్తే రూ. 118కు చేరిందని, ఒక్కో లీటర్‌పై రూ. 35 చొప్పున పెరగడం సంస్థపై భారం పడుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా డీజిల్ ధరలు పెరుగుతుండడంతో డీజిల్ సెస్ తప్పడం లేదన్నారు. 


పెరిగిన బస్ పాస్ ఛార్జీలు


ఇటీవల అన్ని రకాల బస్‌ పాస్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పెంచింది. పెంచిన ధరలను ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్డినరీ పాస్‌ ఛార్జీని రూ.950 నుంచి రూ.1150కి పెంచింది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్‌ రూ.1,185 నుంచి రూ.1,450కు పెంచింది. మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్‌ పాస్‌ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఎన్‌జీవో బస్‌పాస్‌లకు ఆర్డినరీ పాస్‌ ఛార్జీ రూ.320 నుంచి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700కు పెంచింది. ఎంఎంటీఎస్‌–ఆర్టీసీ కోంబో టికెట్‌ ఛార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.


సెఫ్టీ సెస్ పేరుతో అదనపు వసూళ్లు 
 
పల్లెవెలుగు, ఇతర కేటగిరీల బస్సుల్లో చిల్లర సమస్య కారణంగా రౌండప్ పేరుతో ఛార్జీల సవరణ చేసి కొంత మేర అదనపు ఛార్జీలు వసూలు చేశారు. ఆర్టీసీ సేఫ్టీ సెస్‌ పేరుతో బస్ టికెట్‌పై రూపాయి పెంచింది. చిల్లర సమస్య రాకుండా చేయడంతో టికెట్‌ ధర రూ.5 మేర పెరిగింది. ఇప్పుడు డీజిల్ సెస్ పేరుతో మరో రూపంలో వసూలు చేసేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. రోజుకు సగటున ఆరు లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుంది. ఆర్టీసీ వివిధ రకాల బస్సు సర్వీసుల్లో సెస్ పేరుతో అదనపు ఆదాయాన్ని పొందనుది. డీజిల్ ధరల పెరగడంతో సరుకు రవాణా ఛార్జీలు పెంచింది. వేసవిలో ఏసీ బస్సులో ప్రయాణించాలని అనుకునే వారు అదనంగా చెల్లించాల్సిందే. సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.