Telangana News: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు రూపకల్పన చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలు అయిన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముందునుంచే పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ నాయకులు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారు. 2023 ఎన్నికలపై మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుకుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 20, 21, 22వ తేదీల్లో బీజేపీ ముఖ్య నేతలకు శిక్షణా తరగతులు ఇవ్వనున్నారు. ఈ తరగతుల్లో బీజేపీ నేతలకు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. 


ఎన్నికల సమయాల్లో ప్రజల్లోకి ఎలా వెళ్లాలి, పార్టీని క్షేత్ర స్థాయిలో ఎలా బలోపేతం చేయాలంటే దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నవంబర్ చివరి వారంలో తెలంగామ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఐదో విడద పాదయాత్ర ప్రారంభం కానుంది. కాగా పాదయాత్ర కొనసాగిస్తూనే పలు నియోజకవర్గాల్లో బలమైన నేతల కోసం అన్వేషణ చేయాలని స్థానిక నేతలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా పలువురు ముఖ్య నేతలను కూడా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే జరిగిన మునుగోడు ఉప ఎన్నికల రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో కీలకమని పలు రాజకీయ పార్టీలు భావించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు జాతీయ పార్టీలు మునుగోడులోనే మకాం వేశారు. ఇక అందరి అంచనాలను తారుమారు చేస్తూ టీఆర్ఎస్ గెలుపొందింది. 


టీఆర్ఎస్ కూడా పార్టీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాపై దృష్టి సారించారు. అభివృద్ధి పనులు, ప్రజాసమస్యల పరిష్కారంపై నాయకులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక నుంచి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యారు. తమ నియోజకవర్గాల్లో పర్యటనలపై ఎమ్మెల్యేలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంతో గ్రామాల్లో తిరుగుతూ ప్రజాసమస్యలు తెలుసుకుంటున్నారు. మంత్రులు కూడా నియోజకవర్గాల్లో ఉంటూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సైతం వీలు చేసుకుని కార్యకర్తలను కలుస్తున్నారు. మునుగోడు బైపోల్ రిజల్ట్ జోష్ తో టీఆరెస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. సిట్టింగ్ నేతలు సీట్లను కాపాడుకునేందుకు చూస్తుండగా, వచ్చే ఎన్నికల్లో తాము ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని మరికొందరు నేతలు గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.


రాష్ట్రంలో జరిగిన రాహుల్ గాంధీ జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రాహుల్ గాంధీ సభకు సైతం భారీగా జనాలు రావటంతో హస్తం పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. ఇక ఇదే ఊపులో నియోజకవర్గాల్లో తిరిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ... నియోజకవర్గాల్లో పర్యటనలు చేసేందుకు ఆ పార్టీ నేతలు రెడీ అవుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఇక జిల్లాలో పర్యటించేందుకు రూట్ మ్యాప్ వేసుకుంటునట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేతలు ప్రజాల్లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కిందిస్థాయి నేతలతో టచ్ లో ఉంటున్నారు. రాష్ట్రంలో పట్టు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాయి.