Kishan Reddy Meet With BJP MLAs: నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) శనివారం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. తొలుత గెలిచిన శాసనసభ్యులను కిషన్ రెడ్డి సన్మానించారు. అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానుండడంతో సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై చర్చించారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎమ్మెల్యేలంతా దర్శించుకున్నారు. అయితే, తొలి రోజు వారు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) తెలంగాణ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్ (Protem Speaker) అయితే తనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ ప్రమాణ స్వీకారం చెయ్యరని ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సమావేశంలో కిషన్ రెడ్డితో చర్చించిన నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.


'అది లోపాయికారి ఒప్పందం'


కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేశారని మండిపడ్డారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన అక్బరుద్దీన్ ను ఎంపిక చేశారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానం నుంచి 8 స్థానాలకు ఎదిగామని అన్నారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీని ప్రజలు ఆదరించారని, వారి నమ్మకం నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. 'మా ఓటు బ్యాంకు 6 నుంచి 14 శాతానికి పెరిగింది. కాంగ్రెస్ తన పాత అలవాటు ప్రకారం శాసనసభ గౌరవాన్ని కాలరాసింది. మజ్లిస్ తో ఒప్పందం ప్రకారమే ఆ పార్టీ అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ ను చేసింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. సీనియర్ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నా అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా చేశారు. ఆయన ఎదుట బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయరు. ఈ అంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం. స్పీకర్ ఎన్నికల ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తర్వాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా, దగ్గినా పడిపోతుంది. అందుకే మజ్లిస్ ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోంది.' అని కిషన్ రెడ్డి విమర్శించారు.


Also Read: Telangana Assembly Sessions: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ప్రమాణం