Harish Rao: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సీఎం సీటు కాదు కదా, సింగిల్ డిజిట్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలని మంత్రి హరీష్ రావు కేంద్ర మంత్రి హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. ఖమ్మం రైతు గోస - బీజేపీ భరోసా సభలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌ రావు ట్విటర్ వేదికగా స్పందించారు.  ‘నూకలు మాకు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పీయూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బీజేపీకి ఇక్కడ నూకలు చెల్లిపోయాయి. బ్యాట్ సరిగా పట్టుకోవడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది’ అంటూ విమర్శించారు






‘పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్ కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోకముడిచిన మీరా.. రైతు బాంధవుడైన కేసీఆర్‌ను విమర్శించేది. 2జీ 3జీ 4జీ కాదు.. కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీది. రాబోయే ఎన్నికల్లో మీరు మాజీలే. సీఎం పదవి  కాదు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజీ లేని యోధుడు కేసీఆర్. అబద్ధపు విమర్శలు, అవుట్ డేటెడ్ ఆరోపణలతో రాసిచ్చిన స్క్రిప్ట్‌తో కేంద్రం హోం మంత్రి స్కిట్ చేశారు’’ అంటూ మంత్రి హరీశ్‌ రావు సటైర్లు వేశారు.


కేసీఆర్‌పై అమిత్ షా విమర్శలు
తెలంగాణలో కేసీఆర్ 9 ఏళ్లుగా రజాకర్లతో కలిసి పాలన కొనసాగిస్తున్నారని ఖమ్మం జరిగిన ‘రైతు గోస బీజేపీ భరోసా’ సభలో అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ అంటే వంశపారపర్యంగా పాలించే 4జీ పార్టీ అని, ఒవైసీ పార్టీ ఎంఐఎం 3జీ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ అయితే కేసీఆర్, కేటీఆర్ తో 2జీ పార్టీగా ఉందని సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చేది 2జీ, 3జీ, 4జీ పార్టీలు కాదని, ప్రజల పార్టీ నరేంద్ర మోదీ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. 


సీఎం కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూల్ ఇళ్లులు కట్టించలేదని, రైతులకు రుణాలు మాఫీ చేయలేదని, అన్ని వర్గాలను 9 ఏళ్లుగా మోసం చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ రైతుల కోసం బడ్జెట్ లో కేవలం 20 వేల కోట్లు పెడితే.. ప్రధాని మోదీ రైతుల కోసం లక్ష కోట్ల బడ్జెట్ తెచ్చారన్నారు. ధాన్యం సేకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 475 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే.. మోదీ ప్రభుత్వం 900 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించిందన్నారు. బియ్యం మీద కనీస మద్దతు ధర 67శాతం పెంచింది బీజేపీ ప్రభుత్వం. 11 కోట్ల మంది రైతులకు, 2.60 లక్షల కోట్ల కిసాన్ సమృద్ధి నిధిని అందిస్తోందని, 10వేల FPOలను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.


వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ వాళ్లు బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేసి, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి మూర్ఖపు చర్యలకు బీజేపీ శ్రేణులు భయపడవన్నారు. కిషన్ రెడ్డిని, బండి సంజయ్‌ను కేసీఆర్ అక్రమంగా నిర్బంధించారని.. ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి బయటకు పంపించారంటూ మండిపడ్డారు. కేసీఆర్ భక్తుల మనోభావాల్ని అర్థం చేసుకోవడం లేదన్నారు. త్వరలో బీజేపీ సీఎం భద్రాచలంలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో తమకు ఎలాంటి పొత్తు లేదని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పాలన కారణంగా తెలంగాణలోనూ సంపూర్ణ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.