TS Politics :  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ఉద్రిక్తంగా మారింది. ఎప్పుడూ సభలో అధికార, విపక్షాల మధ్య నువ్వా-నేనా అన్నరేంజ్‌ లో వాతావరణం గరంగరంగా ఉండేది. కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాల బయట ఉద్రిక్తమయింది.  నిరసనకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశంగా మారింది.  గత కొన్నిరోజులుగా తెలంగాణలో కొంత‌మంది విలేజ్‌ రెవిన్యూ అసిస్టెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వీఆర్‌ ఏలు  అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వందలమంది హాజరైన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు.  మరోవైపు  కాంగ్రెస్‌ మత్స్యకార సంఘాలు, ఉపాధ్యాయ, రెడ్డి సంఘాలు సైతం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించాయి. నలు వైపుల నుంచి నిరసన కారులు శాసనసభ వైపుకి దూసుకురావడంతో పోలీసులు ఎక్కడిక్కడ వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ భారీగా తరలివచ్చిన నిరసకారులను అడ్డుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందారు. పెద్ద సంఖ్యలో నిరసనకారులు అసెంబ్లీ వైపుకి దూసుకురావడంతో వారందరినీ చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. 


అసెంబ్లీ ముట్టడి హెచ్చరికలు ఉన్నా అడ్డుకోలేకపోయిన పోలీసులు 


అయితే ఇదంతా  ఇంటెలిజెన్స్‌ వైఫల్యం కారణంగానే జరిగిందన్న వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ ముట్టడి విషయంలో ఈ విభాగం నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఇంత ఉద్రిక్త వాతావరణం నెలకొందన్న మాటల నేపథ్యంలో ఏపీలో జరిగిన ఉద్యోగసంఘాల నిరసనతో ఈ విషయాన్ని ముడిపెడుతున్నారు ఇంకొందరు. కొద్ది నెలల క్రితం ఏపీలో కూడా ఇలానే సచివాలయ ముట్టడికి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి విజయవాడకు చేరుకున్న ఉద్యోగులను నిలువరించడంలో పోలీసు శాఖ విఫలమైంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇలా అన్ని చోట్ల పోలీసులను పెట్టినా కానీ ఉద్యోగుల నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. ఊహించిన విధంగా ఉద్యోగులు విజయవాడకు చేరుకొని తమ నిరసన గళాన్ని , ప్రభుత్వ వ్యతిరేకతను తెలిసొచ్చేలా చేశారు. ఇందులో కూడా ఇంటలిజెన్స్‌ వైఫల్యం ఉందని వాదన తెరపైకి వచ్చింది. అయితే డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ని ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే బదిలీ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.


ఇంటలిజెన్స్ వైఫల్యం ఉందా ? 





ఇదే పద్ధతిని తెలంగాణలో కూడా నిరసనకారులు ఫాలో అయ్యారని చెబుతున్నారు. ఇంటెలిజెన్స్‌ ముందే హెచ్చరించినా కానీ ఆస్థాయిలో పోలీస్‌ శాఖ అప్రమత్తం కాలేదని మరో ఆరోపణ కూడా వినిపిస్తోంది.  మేము ముందే చెప్పాం వెయ్యిమంది దాకా వ‌స్తున్నార‌నీ, అయినా పోలీసులు చోద్యం చూశార‌నీ, వారిని ఇక్క‌డ దాకా రాకుండా చేయాల్సింది. జిల్లాల్లోనే అదుపుచేస్తే ప‌రిస్థితి ఇక్క‌డ‌దాకా వ‌చ్చేది కాద‌ని ఓ ఇంటిలిజెన్స్ అధికారి ఏబీపీదేశం ప్ర‌తినిధితో చెప్పారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా కానీ నలుదిక్కుల నుంచి వెల్లువలా వచ్చిన నిరసనకారులను అడ్డుకోవడం ఏమాత్రం ఆలస్యమైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదని ప‌లువురు అభిప్రాయపడుతున్నారు.




వీఆర్ఏలను పిలిచి చర్చలు జరిపిన కేటీఆర్ ! 
 
మ‌రోవైపు అందోళ‌న చేస్తున్న విలేజ్‌ రెవిన్యూ అసిస్టెంట్లను మంత్రి కేటిఆర్ అసెంబ్లీలోని  త‌న ఛాంబ‌ర్ లోకి పిలిపించుకొని మాట్లాడారు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదన్నని చెప్పారు. వీఆర్ఏల డిమాండ్ల పైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నద‌ని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జాతీయ సమైక్యత వజ్రొత్సవ సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో వీఆర్ఏలు తమ ఆందోళనలను విరమించి విధుల్లో జాయిన్ కావాలని కేటీఆర్ వారిని కోరారు. 17వ తేదీన జాతీయ సమైక్యత వజ్రోతవ సంబరాలు ముగిసిన అనంతరం 18వ తేదీ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీఆర్ఏ ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తారని ఆయ‌న పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ తమను పిలిచి తమ వాదన వినడం పట్ల వీఆర్ఏల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.