కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ అంశంపై సోమవారం (ఫిబ్రవరి 13) హైకోర్టులో విచారణ జరిగింది.  ప్రజశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఈ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారణ చేపట్టగా, మాస్టర్ ప్లాన్‌ నిర్ణయాన్ని హోల్డ్‌ లో పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నగర ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నిలిపివేశామని చెప్పింది. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే పూర్తిగా ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. 


అయితే కోర్టుకు తెలపకుండా మాస్టర్ ప్లాన్‌పై ఏ నిర్ణయమూ తీసుకోవద్దని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అలాగే సింగిల్ బెంచ్‌లో ఉన్న మరో పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఇంప్లీడ్ చేస్తూ తదుపరి విచారణ ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది.


అటు డివిజన్ బెంచ్‌లో పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రైతుల అభ్యంతరాలను తీసుకోకుండా మాస్టర్ ప్లాన్‌పై జీవో ఇచ్చారని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వ నిర్ణయం తెలపాలని గత విచారణ విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. గత విచారణలో కేఏ పాల్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మాస్టర్ ప్లాన్ కారణంగా ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఒక ఎకరం లేదా అంతకంటే తక్కువ ఉన్న దాదాపు 2 వేల మంది సన్నకారు రైతులు జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వారి అభిప్రాయాలు తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్‌ జారీ చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా.. ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారని ఆరోపించారు. 


ఇక ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ నియంతలుగా వ్యవహరిస్తున్నారని పాల్ కోర్టుకు తెలిపారు. ఇక మరోవైపు ప్రతిపాదిత మాస్టర్‌ప్లాన్‌ను ఉపసంహరించుకోవాలని పురపాలక సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానాన్ని సమర్పించిందని కామారెడ్డి మున్సిపాలిటీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనలపై కేఏ పాల్ స్పందిస్తూ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ను ఉపసంహరించుకోవడానికి లేదా రద్దు చేయడానికి మున్సిపాలిటీకి ఎటువంటి అధికారాలు లేవని వాదించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది. ఆ క్రమంలోనే నేడు హైకోర్టులో విచారణ జరిగింది. 


అసలు ఏం జరిగింది? 
మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డి రైతులు ఉద్యమ బాట పట్టారు. దీంతో రైతులకు మద్దతుగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. మున్సిపల్‌ కార్యవర్గం అత్యవసర సమావేశం నిర్వహించి ముసాయిదాను రద్దు చేసింది. దీంతో మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానాన్ని కౌన్సిలర్లంతా ఆమోదించారు. ఈ డిజైన్ డెవలప్‌మెంట్ ఫోరం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ఉపసంహరించుకోవాలని కౌన్సిల్ అత్యవసర సమావేశంలో నిర్ణయించినట్లు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ చైర్‌ పర్సన్ జాహ్నవి తెలిపారు.