Electric Vehicle charging stations In Telangana: హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్లు (EV Charging Stations) ఏర్పాటు చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని టీఎస్ రెడ్ కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న సోలార్, విండ్, స్మాల్ హైడ్రో పవర్, చెత్త నుంచి విద్యుత్ తయారీ, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై రాష్ట్ర సచివాలయంలో TS REDCO అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష చేశారు. 
విద్యుత్ వాహనాలకు చార్జింగ్
పెట్రోల్ డీజిల్ వాహనాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టవచ్చు అన్నారు. దాంతో పాటు ఇంధన పొదుపు లో భాగంగా మార్కెట్లోకి వస్తున్న విద్యుత్ వాహనాలకు చార్జింగ్ అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ కొరత రాకుండా ఉండటానికి సోలార్ విద్యుత్ ను పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని జలాశయాలపై సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ రూప్ టాప్ సిస్టం ఏర్పాటు చేసుకుని అమలు పరచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సోలార్, విండ్, హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్ లాంటి టెక్నాలజీ పాలసీలు పెండింగ్లో ఉన్న అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో మంత్రి చర్చించారు.
బయోగ్యాస్ ప్లాంట్ ల ఏర్పాటు
మున్సిపల్ ప్రాంతాల్లో సేకరించిన చెత్త నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్, విద్యుత్ తయారీ పనులు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై ఆరా తీశారు. ఖమ్మం వరంగల్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో బయోగ్యాస్ ప్లాంట్ ల ఏర్పాటు గురించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కి పంపించిన ప్రతిపాదనల గురించి టీఎస్ రెడ్కో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య డిప్యూటీ సీఎంకు వివరించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి గృహ వినియోగదారులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీల పై అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఆదేశాలు ఇచ్చారు. గృహ వినియోగదారులకు ఒక కిలో వాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు 18 వేల రూపాయల రాయితీ ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పారు. మూడు కిలో వాట్స్ వరకు కిలో వాట్ కు 18 వేల రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తామన్నారు. 






మూడు కిలో వాట్స్ నుంచి పది కిలో వాట్స్ వరకు కిలో వాట్ కు 9వేల రూపాయల చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు. ఈ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఉపయోగంతో కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి భట్టి విక్రమార్క సూచించారు. టీఎస్ రెడ్కో సంస్థ నిర్వహణ,  బోర్డు కమిటీ, సంస్థ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, సంస్థ సిబ్బంది పని తీరు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. జానయ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ ప్రసాద్, ప్రాజెక్ట్ డైరెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాస్, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.