Posting Orders To IPS Officers: తెలంగాణలో ఎన్నికల సందర్భంగా అధికారులు బదిలీలు జరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌పీఏ జాయింట్‌ డైరెక్టర్‌గా రంగనాథ్‌, టీఎస్‌పీఏ డిప్యూటీ డైరెక్టర్‌గా రాజేంద్ర ప్రసాద్, సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి, గ్రే హౌండ్స్‌ ఎస్పీగా వెంకటేశ్వర్లును నియమించింది. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా నితికా పంత్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రోహిత్ రాజ్, ట్రాఫిక్ డీసీపీగా ఆర్.వెంకటేశ్వర్లు, పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే దానికి ముందు పలువురు అధికారులను బదిలీ చేస్తారు. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 


ఇప్పటికే 13 మంది ఎస్పీలు, సీపీలకు స్థాన చలనం
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌లను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు బదిలీ జాబితాలో ఉన్నారు. విధి నిర్వహణలో అధికారుల అలసత్వంపై ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఈసీ యాక్షన్ తీసుకుంది. కీలక శాఖల అధికారులు, పలు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను బదిలీ చేసింది. ప్రధాన నగరాల పోలీస్‌ కమిషనర్లకూ స్థానచలనం కలిగింది. నలుగురు కలెక్టర్ల బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి జిల్లా కలెక్టర్‌ కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్ రెడ్డిని బదిలీ చేసింది. వీరితో పాటు 13 మంది ఎస్పీలు, సీపీలను సైతం ట్రాన్స్‌ఫర్‌ చేసింది.


కమిషనర్లు సైతం బదిలీ
హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, వరంగల్ సీపీ రంగనాథ్‌ను సైతం బదిలీ చేసింది. సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్‌, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎస్పీ భాస్కర్‌, మహబూబ్‌నగర్‌ ఎస్పీ నర్సింహ, నాగర్‌ కర్నూల్‌ ఎస్పీ మనోహర్‌, జోగులాంబ గద్వాల ఎస్పీ సృజన, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్‌ ఎస్పీ చంద్రమోహన్‌, భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్‌, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇటు ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో పాటు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజ్‌ను సైతం ట్రాన్స్‌ఫర్ చేసింది సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌. ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.


ఫిర్యాదుల నేపథ్యంలో
అక్టోబరు 3 నుంచి 5 వరకు ఎన్నికల కమిషన్‌ అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలపై సమీక్షించారు. పోలీసుశాఖతో నిర్వహించిన సమావేశంలో కొందరు అధికారుల పనితీరుపై ఈసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో ఎస్పీ స్థాయి అధికారులే ఎక్కువగా ఉన్నారు.  ప్రతిపక్ష పార్టీలు కూడా కొందరు పోలీసు అధికారుల పనితీరును విమర్శిస్తూ వారిని మార్చాలని వినతిపత్రం సమర్పించాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున అధికారులను మార్చే అధికారం కమిషన్‌కు ఉంటుంది. దీంతో  కొందరు ఎస్పీలకు స్థానచలనం కల్పిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.