కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర సభ్యులు బోర్డు సమావేశానికి హాజరై అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా మరో తేదీని ఖరారు చేయాలని ఈ లేఖలో కోరింది. ఈ మేరకు రెండు బోర్డులకు విడివిడిగా లేఖలు రాసింది.


సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసుల విచారణ ఉండటం వల్ల సోమవారం నిర్ణయించిన బోర్డు భేటీకి హాజరు కాలేమని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ ఇంతకుముందే లేఖలు రాశారు. అయితే కార్యాచరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశించిన నేపథ్యంలో సమయాభావం వల్ల సమావేశాన్ని నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. ఈ సమావేశానికి హాజరుకావాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ లేఖ రాశాయి.


అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా, గోదావరి బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోమారు లేఖలు రాసింది. రెండు బోర్డుల ఛైర్మన్లకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ విడివిడిగా లేఖలు రాశారు.


కేసుల విచారణ కారణంగా సోమవారం నిర్వహించే సమావేశానికి హాజరు కాలేమని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సభ్యులు బోర్డు భేటీకి హాజరై అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా మరో తేదీని సూచించాలని రెండు బోర్డులను కోరారు. పాలనాపరమైన అంశాలతో పాటు కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన అంశాలను కూడా తదుపరి సమావేశ ఎజెండాలో చేర్చాలని కేఆర్ఎంబీ ఛైర్మన్‌ను కోరారు. లేఖల ప్రతులను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి కార్యాలయానికి కూడా పంపించారు.


ఇటీవల చెలరేగిన వివాదం..


కృష్ణా నదీ జలాలపై తెలంగాణ అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇటీవల సుప్రీంకోర్డులో పిటిషన్ దాఖలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తోందని.. విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొంది. ఏపీకి రావాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని ఆరోపించింది. ఈ సందర్భంగా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది.


ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీకి, జల్ శక్తి మంత్రికి లేఖలు రాశారు. అలాగే నదీ జలాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వ వైఖరిపై కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు కూడా ఫిర్యాదు చేశారు. నదీ జలాల విషయంలో తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ ఇటీవల తన లేఖలో కోరారు. కేఆర్‌ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు.