రాష్ట్ర వ్యాప్తంగా కీమో థెరపీ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించామన్నారు మంత్రి హరీష్ రావు. మొదటి దశలో సిద్దిపేట, ఖమ్మం, వనపర్తి, కరీంనగర్ జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సిద్దిపేట GGHలో డే కేర్ కీమో థెరపీ కేన్సర్‌ చికిత్స విభాగాన్ని ఆయన ప్రారంభించారు. నాలుగు పడకలతో కీమో థెరపీ ప్రత్యేక వింగ్ అక్కడ సేవలందించబోతోంది. హైదరాబాద్ బయట కీమో సేవలు అందించడం ఇదే తొలిసారి. అన్ని జిల్లాల్లో కీమో సేవలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని హరీష్ రావు తెలిపారు.


MNJ ఆస్పత్రి సరిపోవడం లేదని పెంచాం


డయాలసిస్ సేవలు ఎలా అందుతున్నాయో అలాగే క్యాన్సర్ సేవలు కూడా జిల్లాలో అందుతాయన్నారు మంత్రి హరీష్ రావు .మొదటి సైకిల్ MNJ, NIMSలో అయిన తరువాత మిగితా సైకిల్స్ ఇక్కడ ఇస్తారని అన్నారు. ప్రతి సైకిల్‌కు ఆరు గంటల సమయం పడుతుందన్నారు. ప్రయివేటు ఆస్పత్రిలో ఒక్కో సైకిల్‌కు దాదాపు రూ.30 వేలు అవుతుంది.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అందిస్తున్నాం. మూడు, నాలుగు లక్షల విలువైన ట్రీట్ మెంట్ ఉచితంగా అందిస్తూన్నాం. సిద్దిపేటలో 468 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. వీరిలో కొందరికి కీమో థెరపీ అవసరం. డయాలిసిస్ సేవలు మొదలయ్యాక ఆ పేషేంట్లలో మానసిక దైర్యం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి, ఇప్పటి వరకు రూ. 800 కోట్ల క్యాన్సర్ చికిత్సలు ఆరోగ్యశ్రీ కింద అందించింది. MNJ ఆస్పత్రి సరిపోవడం లేదని 750 పడకల ఆస్పత్రిగా మార్చుకున్నాం అన్నారు మంత్రి హరీష్ రావు.


108 కు 200 కొత్త అంబులెన్స్ వాహనాలు


దాదాపు 20 లక్షలు ఖర్చయ్యే బోన్ మ్యారో చికిత్సను, నెలకు 20 మందికి చొప్పున నిమ్స్, MNJఆస్పత్రిలో ఉచితంగా అందిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. ప్లాస్టిక్, గుట్కా, పాన్ మసాలాలు మానేస్తే క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. సిద్దిపేటలో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, బయాప్సీ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. బ్లడ్ సేపరేటర్ ఇక్విప్మెంట్ కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. యువత రక్తదానం చేస్తే, ఆది పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. అంబులెన్స్ సమయాన్ని కూడా తగ్గించాలని చూస్తున్నామనీ.. ప్రస్తుతం 20 నిమిషాలున్న సమయాన్ని 12 నిమిషాలకు తగ్గించాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు.  200 కొత్త అంబులెన్స్ వాహనాలను 108 కు అందించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో 9 కొత్త మెడికల్ కాలేజీలు ఈ ఏడాది ప్రారంభించబోతున్నామని.. 7 కాలేజీలకు అనుమతి సాదించాం.. మిగితా 2 కాలేజీలకు అనుమతి కోసం కృషి చేస్తున్నామని అన్నారు. 60 ఏళ్లలో మూడు కాలేజీలు ఉంటే, ఈ రెండేళ్లలో 17 మెడికల్ కాలేజీలు రావడం వైద్య విద్యలో ఇదొక విప్లవమన్నారు హరీష్ రావు. 33 జిల్లాలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని తెలిపారు. సిద్దిపేట మెడికల్ కాలేజీలో 13 డిపార్ట్మెంట్లలో 62 పీజీ సీట్లు వచ్చాయని తెలిపారు. డెర్మటాలజీ, అనస్తీషియా, ఆర్థోలో ఈ ఏడాది పీజీ సీట్లు తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రీసెర్చ్ ఫెసిలిటీటీస్ కూడా రూ. 5 కోట్ల తో అందుబాటులోకి తేబోతున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు.