Telangana Govt LRS Scheme: హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ (Land Regularisation Scheme) దరఖాస్తులను మార్చి 31లోపు క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. లేఔట్లు క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వీలు కల్పించింది. దాంతో 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. దేవాయల, వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్పా, ఇతర భూముల రెగ్యులరైజేషన్ కు అడ్డంకులు తొలగినట్లయింది.  లేఔట్ల భూములను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. 


2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలల పాటు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారు. కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఓపెన్ ప్లాట్లు, నాన్ లే అవుట్ కు సంబంధించిన వాటికి దరఖాస్తుదారులు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించి, తమ డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. పెద్ద లే అవుట్ స్థలాలకు సంబంధించి రూ.10 వేలు దరఖాస్తు ఫీజుగా చెల్లించారు. ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న కుటుంబాలన్నీ ప్రభుత్వ నిర్ణయం కోసం నాలుగేండ్లుగా నిరీక్షిస్తున్నాయి. వివిధ కోర్టు కేసులతో ఈ ప్ర్రక్రియ ఆలస్యమైందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఈరోజు సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లక్షలాది కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్ర్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.


వారికి క్రమబద్దీకరించుకునేందుకు సర్కార్ ఛాన్స్ 
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ (LRS) వల్ల స్థానిక సంస్థలకు ఆదాయం సమకూరింది. అనుమతి లేకుండా చేసిన లే అవుట్లలో కొనుగోలు చేసిన వారికి క్రమబద్దీకరించుకునేందుకు సర్కార్ మరోసారి అవకాశం కల్పించింది. అనధికార లే ఔట్‌లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇళ్లు నిర్మాణానికి అనుమతులు రాక, అటు అమ్ముకునేందుకు వీలు లేకుండా ఉండేది. ఈ క్రమంలో ఆ లే ఔట్లలో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం తీసుకొచ్చింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ధరఖాస్తులు వచ్చాయి. ఈ విషయంపై కొందరు కోర్టులను ఆశ్రయించడంతో కొంతకాలం నుంచి ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం లే ఔట్ల కోసం ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 31లోగా క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది.


ఈ భూములకు నో పర్మిషన్..
ఎల్‌ఆర్‌ఎస్‌కు ధరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, చెరువు శిఖం భూములలో ఉన్న లే అవుట్లకు అనుమతి ఇవ్వకూడదని, వాటిని స్కీంలో నుంచి తొలగించారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సైతం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు అనుమతించలేదు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించి లే ఔట్‌లను వేయడంతో ప్రభుత్వ భూములను, చెరువు శిఖం భూములను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం అనుమతి లేని లే ఔట్లను మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం ద్వారా రెగ్యులరైజేషన్‌ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.