Telangana News :  గురువారం నుంచి రుణమాఫీని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లుగానే అధికారులు ప్రక్రియ ప్రారంభించారు.  రుణ‌మాపీ చెల్లింపుల‌కు ఆర్థిక శాఖ నుంచి రూ. 167.59 కోట్లు విడుద‌ల‌య్యాయి. గురువారం రూ. 37 వేల నుంచి రూ. 41 వేల మ‌ధ్య ఉన్న రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. దీంతో 44,870 మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూరింది.  రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటరుణాల మాఫీని పూర్తిచేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రక‌టించారు.  రూ.లక్షలోపు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.


2014లో ఇచ్చిన హామీ మేరకు రూ. 36 వేల వరకు ఉన్న రుణాలను  నిన్నటి వరకూ మాఫీ చేశారు. తాజాగా మిగిలిన రుణాల మాఫీకి పచ్చజెండా ఊపారు. రుణమాఫీ పున:ప్రారంభ ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభించాలని, మొత్తం రుణాలను 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్‌ రెండో వారంలోగా పూర్తిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు.  సుమారు 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నది.  తాజా రుణమాఫీతో సుమారు 29.61 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.                      


అంటే భారత ‘రైతు’ సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌  అన్నారు. జై కిసాన్ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానం అని తేలిపోయిందని చెప్పారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా, బీజేపీ  ర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా, రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనమని వెల్లడించారు.                           



రైతు సంక్షేమంలో తొమ్మిదేండ్ల తెలంగాణ  ) ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని చెప్పారు. రైతుకు రక్షణ కవచంగా అమలుచేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకమన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం.. కానీ, ఒక్క తెలంగాణలోనే వ్యవసాయం అంటే సంతోషమని పేర్కొన్నారు. యావత్ తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న నినాదమిదని సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేశారు.