AP Early Polls :  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి వచ్చే మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఎప్పటికప్పుడు ముందే ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ఊపందుకుంటూనే ఉంది.  అయితే డిసెంబర్‌లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికలు జరగాలంటే.. ఏపీ అసెంబ్లీని సీఎం జగన్మోహన్ రెడ్డి రద్దు చేయాల్సి ఉంటుంది. కానీ సీఎం జగన్ ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు.  కానీ రాజకీయ పార్టీలు మాత్రం నమ్మడం లేదు. మరో వైపు ఎన్నికల సంఘం కూడా అసెంబ్లీ ఎన్నికలకు ఏపీలో  సన్నాహాలు ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. 


అప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం                
 
తెలంగాణలో డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ సన్నాహాలు ప్రారంభించింది. గత వారమే అన్ని నియోజకవర్గాలకు రిటర్నింగ్ ఆఫీసర్లును నియమించింది. సుదీర్ఘ కాలంగా ఒకే చోట పని చేస్తున్న వారిని బదిలీ చేయమని ఆదేశించింది. ఆ మేరకు బదిలీల ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహాలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేస్తారు. కానీ ఏపీలో మాత్రం.. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. ఏకంగా రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించేశారు.


ఈసీకి ముందస్తు ఎన్నికలపై సంకేతాలున్నాయా ?                   


డిసెంబర్ లో జరిగే తెలంగాణ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించిన కొద్ది రోజుల్లోనే ఏపిలోనూ నియమించడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సంఘం ఏపీలోనూ ఎన్నికల ఏర్పాట్లు చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ తో సంప్రదించారని.. గతంలో పవన్ కల్యాణ్ అరోపించారు. అందులో భాగంగానే అసెంబ్లీని రద్దు చేయకుండానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేశారన్న అనుమానాలు మొదలయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం విశాఖలో సమావేశం నిర్వహించింది. ఓటర్ల జాబితా గురించి అని హైలెట్ అయింది కానీ.. ఎన్నికల సన్నద్దత గురించి ప్రధానంగా చర్చించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలు ఉండకూడదని ఆదేశించారు. 


అసెంబ్లీని రద్దు చేస్తేనే అధికారికంగా ఎన్నికల ప్రక్రియ !                   


అసెంబ్లీని సీఎం జగన్ రద్దు చేస్తేనే అధికారికంగా ఎన్నికల ప్రక్రియను ఈసీ ప్రారంభిస్తుంది. కానీ ఓటర్ల జాబితాపై అనుమానాలు.. ఫిర్యాదులు వెల్లువెత్తున్న సమయంలో నెల రోజుల్లో ఓటర్ల జాబితాను తప్పుల్లేకుండా మార్చేందుకు ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టారు. అంటే ఓటర్ల జాబితా కూడా రెడీ అయినట్లే.  రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా నియమించారు. అంటే..  ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించేలోపు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు అసెంబ్లీని రద్దు చేసినా..  ఎన్నికలు నిర్వహించాడనికి ఈసీ రెడీగా ఉందన్నమాటే.  ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ దిశగానే ఉన్నాయన్నది ఎక్కువ మంది అభిప్రాయం.