International Womens Day 2023 : మహిళా ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. మార్చి 8న రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా సెర్ప్‌, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈనెల 8న రూ.750 కోట్ల రుణాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

  


100 మహిళా ఆసుపత్రులు 


మహిళా దినోత్సవం సందర్భంగా  రాష్ట్ర వ్యాప్తంగా 100 మహిళా ఆస్పత్రులు నిర్మిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ముందు 100 ఆస్పత్రులు నిర్మించి క్రమంగా వాటి సంఖ్య పెంచుతామన్నారు. ఆరోగ్య మహిళల పేరుతో ఈ ఆస్పత్రులను త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు.  ప్రతి మంగళవారం ఆస్పత్రిలో మహిళా సిబ్బందే ఉంటారన్నారు.  సంగారెడ్డి జిల్లాలో మహిళా సమైక్య దుకాణ సముదాయాల నిర్మాణానికి ఇటీవల మంత్రి హరీశ్ రావు భూమిపూజ చేశారు.రాష్ట్రంలో ముఖ్య పట్టణాల్లో ఘనంగా మహిళా దినోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ కూడా స్పష్టం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని, పాత్రను గుర్తు చేసుకునేలా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వివిధ హోదాలలో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, వివిధ ఎన్జీవోల సిబ్బంది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.  మార్చి 8న మహిళా దినోత్సవం రోజు నుంచి ప్రారంభం అయ్యే ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను మున్సిపల్ శాఖ  చేపట్టనుంది.
 
మహిళలకు వడ్డీ లేని రుణాలు 


 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ రామ్ లీలా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత , మంత్రులు గంగుల కమలాకర్ , సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. మహిళా సంఘాలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా 54 లక్షల మందికి 18 వేల కోట్ల రూపాయలను స్వాలంబన కింద అందిస్తున్నామన్నారు. వడ్డీ లేని రుణాలు అభయహస్తం త్వరలోనే విడుదల చేస్తామన్నారు. బిడ్డ లేకుంటే ఇల్లు గడవదు... సమాజమే ముందుకు పోదన్న కవిత.. ఇన్నాళ్లు ఇంటికి పరిమితమైన ఆడబిడ్డలు ఇప్పుడు ఉద్యోగం కోసం బయటకు వస్తున్నారన్నారు. 


చదువే ఆడబిడ్డకు తోడు 


"ఉద్యోగం కోసం బయటకు వచ్చే ఆడబిడ్డలకు భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆడబిడ్డలో ఆత్మస్థైర్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ ది. గత ప్రభుత్వాల హయాంలో ఆడబిడ్డలను ఉన్నత చదువుల కోసం పక్క ఊరుకు పంపించాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ 8000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లలకు టాయిలెట్లు నిర్మిస్తున్నాం. ఇల్లు అద్దెకు దొరకకుండా ఇబ్బందులు పడుతున్న దళిత బిడ్డల కోసం ఎస్సీ డిగ్రీ కాలేజీలు హాస్టలను ఏర్పాటు చేశాం. పోలీస్ శాఖతోపాటు ఇతర శాఖల్లో తెలంగాణ ప్రభుత్వం 33% రిజర్వేషన్లు అమలు చేస్తుంది. ఏది తోడున్నా లేకున్నా... ఆడబిడ్డకు తాను చదువుకున్న చదువు.. జీవిత కాలం తోడుంటుంది. ఎంత కష్టమైనా సరే ఆడబిడ్డ తన చదువుకున్నంత వరకు చదివిద్దాం. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆడబిడ్డలు ఆర్థిక సాధికారత వైపు అడుగులు వేయాలి. మహిళలకు ప్రతిరోజు మహిళా దినోత్సవం కావాలి." - ఎమ్మెల్సీ కవిత