Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో  అరెస్ట్ అయిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ మంజూరైందు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబుకు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దర్యాప్తు అధికారులకు పాస్‌పోర్టు అప్పగించాలని, రూ.2 లక్షల పూచీకత్తు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో ఫిబ్రవరి 8న సీబీఐ.. ఆడిటర్ బుచ్చిబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  


ఫిబ్రవరి 8న అరెస్టు 


దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసింది. ముందు మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. తర్వాత రెండు సార్లు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో గోరంట్ల బుచ్చిబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ గత బుధవారం కోర్టు విచారించింది.  ఈ పిటిషన్ పై వాదనలు తర్వాత ప్రత్యేక జడ్జి తీర్పును వాయిదా వేశారు. తాజాగా తీర్పు ఇస్తూ బుచ్చిబాబుకు బెయిల్ మంజూరు చేశారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ నుంచి అభిషేక్‌ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి గోరంట్ల బుచ్చిబాబు. ఈ కేసులో సీబీఐ, ఈడీ బుచ్చిబాబును ప్రశ్నించాయి. అనంతరం అరెస్టు చేశాయి. ఈ కేసులోనే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు మాగుంట రాఘవ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. రాఘవరెడ్డి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.  


లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర 


 బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కవితతో పాటు ఈ స్కాంలో ప్రముఖంగా వినిపిస్తున్న వ్యక్తుల వద్ద సీఏగా పని చేశారు.  హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును ఫిబ్రవరి 8న సీబీఐ అరెస్ట్ చేసింది. రామచంద్ర పిళ్లైకి చార్టెడ్ అకౌంటెంట్‌గా గోరంట్ల బుచ్చిబాబు పనిచేశారు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నారు. బుచ్చిబాబు ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. గతంలో ఆయన ఇంట్లో సోదాలు కూడా చేసింది. కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. కేసులో ఇప్పటి వరకు సాగిన విచారణ, ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలించి బుచ్చిబాబు పాత్రపై నిర్దారణకు వచ్చింది.  అరెస్టుకు ముందు ఆయన్ని పలుమార్లు ఢిల్లీకి పిలిచి విచారించింది కూడా.  


రామచంద్ర పిళ్లై వద్ద సీఏగా పనిచేస్తున్న బుచ్చిబాబు  


రామచంద్ర పిళ్లై వద్ద చార్టెడ్ అకౌంట్‌గా పని చేస్తున్న గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీఏగా పని చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో కొన్ని మీడియాల్లో కథనాలు కూడా వచ్చాయి. కిందటి ఏడాది సెప్టెంబర్ లో లిక్కర్ స్కాం లింకులతో దేశ వ్యాప్తంగా నలభై చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో దోమలగూడ అరవింద్ నగర్ లోని శ్రీసాయి కృష్ణ రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో ఉన్న బుచ్చిబాబు కార్యాలయంలో ఈడీ సోదాలు జరగడం చర్చనీయాంశం అయ్యాయి. అయితే ఎమ్మెల్సీ కవిత స్థాపించిన భారత జాగృతి రిజిస్టర్ అడ్రస్ కు సమీపంలోనే ఉన్న గోరంట్ల అసోసియేట్స్ ఆఫీసులో ఈ దాడులు జరగడం అనుమానాలకు దారి తీసింది. అప్పట్లో బుచ్చిబాబు ఎ్మమెల్సీ కవితతో బుచ్చిబాబు దిగిన ఫొటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి.