Revanth Reddy Responds EC Decision on Rythubandhu: 'రైతుబంధు' (Rythubandhu) నిధుల విడుదలకు ఈసీ అనుమతి వెనక్కు తీసుకున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. 'రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు చేయాలని ఉద్దేశం మామ, అల్లుళ్లకు లేదు. మంత్రి హరీష్ రావు (HarishRao) వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతి వెనక్కు తీసుకుంటున్నట్లు ఈసీ ఆదేశాలివ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప తెలంగాణలో రైతులకు న్యాయం జరగదు. రైతులు ఆందోళన చెందొద్దు. 10 రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తాం.' అని పేర్కొన్నారు.






ఇదీ జరిగింది


రైతుబంధు కింద తెలంగాణ ప్రభుత్వం ఏటా పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2 సీజన్లకు మొత్తం రూ.10 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. వానాకాలంతో పాటు యాసంగి సీజన్‌ ఆరంభానికి ముందే నిధులు విడుదల చేయడం ఆనవాయితీ. అయితే, ఈసారి శాసనసభ ఎన్నికల దృష్ట్యా కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్‌కు నిధుల జమ జరగలేదు. ఇది కొనసాగుతోన్న పథకమని, దీనికి కోడ్‌ వర్తించదని, నిధుల విడుదలకు అనుమతించాలని ప్రభుత్వం గత నెలలో ఈసీని కోరుతూ లేఖ రాసింది. దీన్ని పరిశీలించిన ఈసీ నిధుల జమకు అనుమతించింది. ఈ నెల 28 లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల ప్రభుత్వానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో 28న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.7 వేల కోట్లు విడుదల చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. 


హరీష్ రావు వ్యాఖ్యలతో


అయితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు తన ప్రసంగంలో రైతుబంధు నిధుల విడుదలకు సంబంధించి ప్రస్తావించారు. 'మీరు సోమవారం టీ తాగే సమయానికి టింగ్ టింగ్ టింగ్ అంటూ రైతుల ఫోన్లకు నిధులు జమ అయినట్లు మెసేజ్ లు వస్తాయి.' అని అన్నారు. కాగా, సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది. కానీ, హరీష్ రావు సోమవారమే డబ్బులు పడతాయని ప్రకటించారు. అటు నవంబర్ 30న పోలింగ్ కాగా, ఇప్పుడు రైతుబంధుకు అనుమతులు ఏంటీ.? అనే ఫిర్యాదులు ఈసీకి వెళ్లాయని తెలుస్తోంది. వీటిని పరిశీలించిన ఎన్నికల సంఘం హరీష్ రావు వ్యాఖ్యలను, పత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించారని నిధుల విడుదలకు ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply


Also Read: Telangana Elections 2023: హరీష్ రావు నోట 'రైతుబంధు' మాట - నిధుల విడుదలకు ఈసీ బ్రేక్