Telangana Congress party gains upper hand in Panchayat elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. మూడో విడతలో జరిగిన ఎన్నికల్లో సగానికిపైగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడుతున్నాయి. ఆఖరి విడత పోలింగ్ బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 3,752 గ్రామ పంచాయతీలు , 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం మూడు విడతల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రదర్శన కనబరుస్తోంది.
మూడోవిడతలో నోటిఫికేషన్ ఇచ్చిన 4,159 గ్రామ పంచాయతీల్లో 394 ఏకగ్రీవం అయ్యాయి. 11 పంచాయతీల్లో నామినేషన్లు లేవు, 2లో హైకోర్టు ఆదేశాలతో ఆగాయి. 3,752 పంచాయతీల్లో పోలింగ్ జరిగాయి. మూడో విడతలోనూ కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం మూడు విడతల్లో కాంగ్రెస్కు ఏడు వేలకుపైగా పంచాయతీలు దక్కే అవకాశం ఉంది. మూడున్నర వేల పంచాయతీలు బీఆర్ఎస్ మద్దతుదారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. తొలి విడతలో ఏకగ్రీవాలు పోను 3,834 పంచాయతీలు, రెండో విడతలో ఏకగ్రీవాలు పోను 4,333 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.
ప్రభుత్వం పై వ్యతిరేకత లేదని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గట్టిగా పోరాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తాము ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రాంతాల్లోనే కాకుండా ఇతర నియోజకవర్గాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా కాంగ్రెస్ నేతలు గట్టిగా పోరాడి విజయాలు వచ్చేలా చేసుకున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు కూడా గ్రామ స్థాయిలో తమ పట్టు జారకుండా చాలా వరకూ గట్టి ప్రయత్నాలు చేశారు. బీజేపీ కొన్ని ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి వంటి చోట్ల మంచి ఫలితాలు సాధించింది.
మూడు దశల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ 55 నుంచి 60 శాతం పంచాయతీలను కైవసం చేసుకున్నట్లుగా భావించవచ్చు. బీఆర్ఎస్ పార్టీ 25 శాతం పంచాయతీలు.. మిగతా పంచాయతీలు.. బీజేపీ, ఇతరులు గెల్చుకున్నారు. ఇతరుల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ఉన్నారు. మొత్తంగా గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ .. అధికార పార్టీగా పట్టు నిలుపుకుంది.
పంచాయతీ ఎన్నికల మూడో విడత ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టులా మారాయని, తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పుకు ఇవి సంకేతమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఈ విజయం వెనుక సమన్వయంతో కూడిన బలమైన ప్రచార వ్యూహాలే ప్రధాన కారణమన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను ఒకే వేదికపై సమన్వయం చేస్తూ గ్రామ స్థాయి వరకు విస్తరించిన ప్రచారం పార్టీకి అనుకూలంగా మారిందని తెలిపారు.
