Telangana CM Revanth Reddy Requests to PM Modi: హైదరాబాద్: తెలంగాణలో పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బేగంపేట ఎయిర్పోర్టులో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఓ జ్ఞాపిక అందజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ నేత, ఎంపీ రాములు సైతం వారి వెంట ఉన్నారు.
రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అనుమతులు, నిధులపై విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందించాలని మొత్తం 11 అంశాలపై ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన రిక్వెస్ట్ చేశారు.
1.ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించింది. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తాం. 2. హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్ధికి, అదే విధంగా మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. 3.తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేంందుకు ప్రధాని మోదీ, కేంద్రం జోక్యం చేసుకోవాలి. 4. హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలి. 2022-23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ,3 కోట్లు మంజూరు చేసింది. రూ.7700 కోట్ల అంచనా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలి. ఈ కారిడార్ తో అటు శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. తద్వారా దక్షిణ తెలంగాణ వైపు రవాణ మార్గాలు విస్తరిస్తాయి. 5. తెలంగాణలో నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. దాదాపు 10 లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లా నీళ్లు అందటం లేదు. సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల జీవన్ మిషన్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.6. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్య, పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేయాలి. కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ కేడర్ పోస్టులను మంజూరు చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పెరిగిన జనాభాను బట్టి రాష్ట్రంలో పోలీసు అధికారుల అవసరం పెరిగింది. అత్యవసరంగా 29 పోస్టులను అదనంగా కేటాయించాల్సి ఉంది. ఐపీఎస్ క్యాడర్ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించాలి. వీలైనంత త్వరగా పోస్టులు మంజూరు చేయాలి.