Telangana News | ఆత్మగౌరవంలోనే కాదు త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారని.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీనే ఇందుకు నిదర్శనం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకునేందుకు తన సొంత ఇంటినే వేదిక చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. అలాంటి వ్యక్తి మరణిస్తే గత ప్రభుత్వం నివాళులు అర్పించని సంఘటనను పద్మశాలి సమాజం మరిచిపోలేదన్నారు.
టైగర్ ఆలే నరేంద్రని కేసీఆర్ ఖతం చేసిండురేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందున్న మరో వ్యక్తి టైగర్ ఆలే నరేంద్ర అని, ఆయనను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేస్తే.. కేసీఆర్ ఆయనను ఖతం చేశారని ఆరోపించారు. పద్మశాలి సోదరులకు న్యాయం చేయడమే తమ ప్రభుత్వ విధానం అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసుకొని దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం అని తెలిపారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని హామీ ఇచ్చారు.
మీ కుటుంబ సభ్యుడిలా మిమ్మల్ని ఆదుకుంటా‘మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రూ.600 కోట్ల విలువైన కోటి 30 లక్షల చీరల ఆర్డర్ ను నేతన్నలకు ఇచ్చి చేనేతను ఆదుకుంటున్నాం. మీరు అడిగింది ఇవ్వడమే నా కర్తవ్యం. నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి సేవ చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు. అభిమానంతో నన్ను గుండెల్లో పెట్టుకుంటే మీ కుటుంబ సభ్యుడిలా మిమ్మల్ని ఆదుకుంటా. తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల అండతో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తాం’ అని అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. ‘రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించి బలహీనవర్గాల లెక్క తేల్చాం. ఇది ఇష్టం లేని వారు లెక్కలు తప్పని మాట్లాడుతున్నారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందని బీఆర్ఎస్, బీజేపీ లెక్కలు తప్పు అని మాట్లాడుతున్నాయి. బలహీన వర్గాల హక్కులను కాలరాసి వారి గొంతులను నులిమేసే కుట్ర జరుగుతోంది. కేసీఆర్ లెక్కలో ఉన్నత కులాలు 21 శాతం అయితే… నేను చేసిన లెక్కలో ఉన్నతకులాలు 15.28 శాతం మాత్రమే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోంది’ అని అన్నారు. ఈ కుట్రలను బీసీ సమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
మీ ఆత్మగౌరవాన్ని నిలబెడతాఇతర రాష్ట్రాల ఎన్నికలలోనూ ఇక్కడి పద్మశాలీలు కీలకంగా వ్యవహరిస్తున్నారని సీఎం అన్నారు. కోటి రూపాయలతో షోలాపూర్లో పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక, రాజకీయంగా, ఉపాధి, ఉద్యోగ పరంగా ఈ ప్రభుత్వం పద్మశాలీలకు అండగా ఉంటుందన్నారు. మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ సోదరుడిగా అండగా ఉంటానని ఈ వేదికగా హామీ ఇస్తున్నానని అన్నారు.