Revanth Reddy Asks Medigadda Details: హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతలకు చెందిన మేడిగడ్డ, అన్నారంలో డ్యామేజీపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రస్తావించారు. ఆపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తామని సైతం చెప్పారు. ముఖ్యమంత్రి నివాసంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 


రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి సీఎం రేవంత్ తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాం (BRS Ruling)లో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో కీలకంగా చర్చ జరిగింది. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నీటి లభ్యత, ఇతర అంశాలపై వారికి పలు సూచనలు చేశారు. 


అంతర్రాష్ట్ర జలవివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్ సీ మురళీధర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.