Telangana News: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సింగరేణి బొగ్గు గనులు, పెండింగ్ లో ఉన్న విభజన హామీలు, రక్షణ శాఖ భూముల బదిలీతో  పాటు మొత్తం 12 అంశాలపై వినతి పత్రాలు అందించారు.


1. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కి బొగ్గు బ్లాకుల కేటాయింపు:


• సింగరేణి ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థ. ఇందులో తెలంగాణ ప్రభుత్వానికి 51శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49శాతం ఈక్విటీ వాటా ఉంది. 
• కేంద్రం వేలం వేస్తున్న బొగ్గు గనుల జాబితాలో సింగరేణి ఏరియాలో ఉన్న శ్రావణపల్లి బొగ్గు బ్లాకును చేర్చారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవెలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ (MMDR) చట్టంలో ఉన్న సెక్షన్ 11A / 17(A) (2) ప్రకారం ఈ గనిని వేలం వేసే గనుల జాబితా నుంచి తొలగించాలి. సింగరేణి ఏరియాలో ఉన్న ఈ గనిని సింగరేణికి కేటాయించాలని కోరుతున్నాను. 


2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM):
• ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంగా తీసుకుంది. కానీ ఇప్పటి వరకు తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేదు. తెలంగాణకు IIM మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నాను. 
• హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో అందుకు సరిపడేంత భూమి అందుబాటులో ఉంది. ప్రత్యామ్నాయంగా, ఎక్కడైనా భూమిని కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.


3. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్ట్:
• 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరు రెండు నగరాలకు ITIR ప్రాజెక్ట్ మంజూరు చేసింది.  
• కొత్త ఐటీ కంపెనీలు, ఐటీ స్పేస్ డెవలపర్‌లను ప్రోత్సహించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం 3 క్లస్టర్లలో అందుకు అవసరమైన భూమిని గుర్తించింది.
• 2014లో ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. హైదరాబాద్ లో తిరిగి ITIR ప్రాజెక్ట్ పునరుద్ధరించాలని కోరుతున్నాను. 


4. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ:
• రాష్ట్ర పునర్విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో వ్యాగన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చింది. 
• 2023 జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ వ్యాగన్ తయారీ కేంద్రానికి బదులుగా కాజీపేటలో పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
• దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరయ్యాయి. కానీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని రైల్వే శాఖ ప్రకటించింది. 
• కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 


5. ఇండియా సెమీకండక్టర్ మిషన్ లో తెలంగాణను చేర్చాలి:
• హైదరాబాదులో సెమీకండక్టర్ ఫ్యాబ్స్‌ను స్థాపించడానికి పేరొందిన కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. 
• ఈ ప్రతిపాదనలన్నీ ప్రస్తుతం ఇండియా సెమీకండక్టర్ మిషన్ సమీక్షలో ఉన్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్లో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించాలని విన్నవిస్తున్నాను. 


6. రాబోయే 5 ఏండ్లలో 25 లక్షల ఇళ్లను మంజూరు చేయాలి:
• ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ (PMAY) తొలి దశలో తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ఇండ్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవటంతో అప్పడు తక్కువ సంఖ్యలో కేటాయించారు. 
• 2024-25 నుంచి ప్రారంభమవుతున్న పీఎంఏవై పథకంలో 3 కోట్ల గృహాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  అందులో తెలంగాణకు 25 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని  కోరుతున్నాను. పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల విధివిధానాలను రూపొందించేందుకు సంసిద్ధంగా ఉంది. 


7. పెండింగ్‌లో ఉన్న BRGF గ్రాంట్‌ల విడుదల:
• వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది నిధి (BRGF) కింద కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకుఅయిదేండ్లలో తెలంగాణకు రూ.2,250 కోట్లు కేటాయించింది. ఒక్కో ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున ఈ గ్రాంట్ మంజూరు చేసింది. 
• వీటికి సంబంధించి 2019-20, 2021-22, 2022-23 మరియు 2023-24 సంవత్సరాలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన రూ.1,800 కోట్లు విడుదల చేయాలని కోరుతున్నాను. 


8. రక్షణ శాఖ భూముల బదిలీ:
• హైదరాబాద్లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్–కరీంనగర్ రహదారి, హైదరాబాద్ నాగ్ పూర్ (జాతీయ రహదారి 44)పై ఎలివేటేడ్ కారిడార్లను నిర్మించ తలపెట్టింది. ఈ రెండు కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా మార్గమధ్యంలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను బదిలీ చేయాలని కోరుతున్నాను. 
• వీటితో పాటు హైదరాబాద్ సిటీలో ర‌హ‌దారుల విస్తర‌ణ‌తో పాటు రవాణా సదుపాయాలు, మౌలిక స‌దుపాయాల క‌ల్పన‌కు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో 2450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని అభ్యర్థిస్తున్నాను. 
• ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ (RIC) కి లీజుకు ఇచ్చిన 2462 ఎకరాల భూములను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.


9. ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు:
• రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. 
• ఈ  ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదికలు సమర్పించాయి. ఖమ్మం జిల్లాలో ఈ ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పే ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థిస్తున్నాను.


10. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం :
• జాతీయ రహదారుల అభివృద్ధిలో బాగంగా భారత్మాల పరియోజన మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డులో ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు జాతీయ రహదారి) నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 50 శాతం భూసేకరణకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వటంతో పాటు రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలని కోరుతున్నాను. 
• హైదరాబాద్ చుట్టూ జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యంత ఉపయుక్తంగా ఉండే  రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) కూడా జాతీయ రహదారిగా గుర్తించాలి. భారత్ మాల పరియోజనలో ఈ రహదారి నిర్మాణం  చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను.  
 
11. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలి :
• తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరముంది. 
• జగిత్యాల–పెద్దపల్లి–కాటారం, దిండి–దేవరకొండ–మల్లెపల్లి–నల్గొండ, భువనగిరి–చిట్యాల, చౌటుప్పల్–అమనగల్–షాద్నగర్–సంగారెడ్డి, మరికల్–నారాయణపేట–రామసముద్ర, వనపర్తి–కొత్తకోట–గద్వాల– మంత్రాలయం, మన్నెగూడ–వికారాబాద్–తాండూరు–జహీరాబాద్–బీదర్, కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు–గద్వాల–రాయచూరు, కొత్తపల్లి–హుస్నాబాద్– జనగాం–హైదరాబాద్, సారపాక–ఏటూరునాగారం, దుద్దెడ–కొమురవల్లి–యాదగిరిగుట్ట–రాయగిరి క్రాస్రోడ్డు, జగ్గయ్యపేట–వైరా–కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్  చేయాలని కోరుతున్నాను.


12. కొత్త  జిల్లాలకు నవోదయ విద్యాలయాలు:
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి. 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని కోరుతున్నాను.