Telangana Cabinet :  తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. సామాజిక పెన్షన్ల సంఖ్యను పది లక్షలు పెంచాలని నిర్ణయించింది. కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ఆగస్టు పదిహేనో తేదీనే లబ్దిదారులను ఎంపిక  చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే  మొత్తంగా కొత్తవి, పాతవి కలిపి 46 లక్షల మందికి పింఛన్ అందుతుంది. ఆరో తేదీన జరిగిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ ఈ పెన్షన్ల విషయాన్ని ప్రకటించారు. ఐదు రోజుల్లోనే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మరో నాలుGగు రోజులలో పంపిణీ చేయనున్నారు. పెన్షన్ల కోసం ఇచ్చే గుర్తింపు కార్డులను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. 


ఉద్యోగాలు, ఆస్పత్రుల ఆధునీకరణకు నిర్ణయం


 మంత్రివర్గ సమావేశంలో ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కోఠి ఈఎన్.టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేస్తూ తీర్మానం చేశారు.  కోఠి ఈఎన్.టి. ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈ.ఎన్.టి.టవర్ నిర్మించనున్నారు.  సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.  కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5111 అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయనుంది.  


ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్ణయం రద్దు  


స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాల ప్రతిపాదనను విరమించుకున్నారు.  21వ తేదీన పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల ఈ ప్రత్యేక సమావేశాలు రద్దు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని నిర్ణయించారు.  జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చీఫ్ సెక్రటరీని క్యాబినెట్ ఆదేశించింది. గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ఒక కమిటీ వేసి... 15 రోజుల్లోగా నివేదిక తీసుకొని శాశ్వత పరిష్కరానికి ప్రణాళికలు వేసింది. వికారాబాద్‌లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల ఎకరాల స్థలాన్ని కేటాయించింది. షాబాద్‌లో షాబాద్‌ బండల పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి 45 ఎకరాలు కేటాయించింది.


తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సమగ్రమైన చర్చ 


తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గంలో  సమగ్రమైన  చర్చ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర యొక్క ఆదాయంలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే, కేంద్రం ప్రభుత్వం నుంచి సీఎస్ఎస్, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు  12.9 శాతం తగ్గిపోయాయనని అధికారులు కేబినెట్‌కు తెలిపారు.  ముఖ్యంగా కేంద్రం నిధులు విడుదల చేయడంలో S.N.A. అకౌంట్లు అనే కొత్త పద్ధతి తేవడం ద్వారా రాష్ట్రాలకిచ్చే నిధులలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నదని అధికారులు తెలిపారు.  అంతేకాక ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితులను సకాలంలో ఇవ్వకుండా పోవడం మరియు పరిమితుల్లో కూడా కోతలు విధించడం జరిగిందన్నారు.  ఎఫ్‌ .ఆర్.బి.ఎంలో కోతలు విధించకుండా ఉండి ఉంటే రాష్ట్రం  ఆదాయం మరింతగా పెరిగి, దాదాపు 22శాతం వృద్ధిరేటు నమోదయ్యేదని అధికారులు తెలిపారు. దేశ జనాభాలో మన రాష్ట్ర జనాభా రెండున్నర శాతమే అయినప్పటికీ, దేశ ఆదాయానికి 5 శాతం మనం కంట్రిబ్యూట్ చేశామని అధికారులు తెలిపారు.