సునీల్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’(Wanted PanduGod). ‘పట్టుకుంటే కోటి’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫుల్ కామెడీ ఎంటర్‌‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని పాటలు, దర్శకత్వ పర్యవేక్షణ కూడా కె.రాఘవేంద్రరావుదే. ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు. 


ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి జంటగా నటించారు. వెన్నెల కిశోర్‌కు జోడీగా విష్ణు ప్రియ, సప్తగిరి సరసన నిత్యశెట్టి, శ్రీనివాస్ రెడ్డికి జంటగా వసంతి నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. చూస్తుంటే.. ఈ చిత్రంలో టైటిల్ పాత్రను సునీల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని పట్టుకోవడం కోసం ఇతర పాత్రదారులంతా అడవిబాట పడతారు. ఈ చిత్రంలో దాదాపు అంతా కమెడియన్స్, యాంకర్సే ఉన్నారు. ఆగస్టు 19న విడుదల కానున్న ఈ చిత్రానికి అప్పుడే ప్రమోషన్స్ మొదలైపోయాయి.


తాజాగా యాంకర్ మంజుషా విష్ణు ప్రియ, దీపిక పిల్లి, వసంతి, సుడిగాలి సుధీర్‌తో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా విశేషాలను పంచుకున్నారు. సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో దీపిక, నేను జంటగా మాత్రమే కనిపిస్తాం. కానీ, హీరో హీరోయిన్లం కాదు. కేవలం పాత్రదారులం మాత్రమే’’ అని తెలిపాడు. దీపిక పిల్లిని జోడిగా కావాలని అడిగింది మీరేనని తెలిసిందని మంజుషా అడగ్గా.. ‘‘అమ్మో, నాకేమీ సంబంధం లేదు. డైరెక్టర్ గారే ఆమెను నాకు జోడిగా సెలక్ట్ చేశారు’’ అని పేర్కొన్నాడు. 


కె.రాఘవేంద్ర రావు సినిమా అంటే గుర్తుకొచ్చేది పండే. ఈ సినిమాలో అలాంటివి ఏమైనా ఉన్నాయా? అని మంజుషా అడిగిన ప్రశ్నకు దీపిక పిల్లి బదులిస్తూ.. ‘‘ఈ సినిమాలోని ఒక విషయాన్ని లీక్ చేస్తాను. సినిమా అంతా ఒకటే పండు లీడ్ చేస్తుంది’’ అని చెబుతుంది. అనంతరం విష్ణు ప్రియ మాట్లాడుతూ.. ‘‘మాకు ఫ్రూట్స్‌తో అభిషేకం జరిగినందుకు చాలా ఆనందిస్తు్న్నాం. రాఘవేంద్రరావు సినిమా అని చెప్పగానే. వేశారా మీ మీద పండ్లు అని అంతా అడిగేవారు. మా అమ్మా.. నీ మీద పుచ్చకాయ వేసుండాల్సింది అని అంది. రాఘవేంద్రరావు గారు మా మీద చాలా కేర్ తీసుకొనేవారు కస్ట్యూమ్స్ నుంచి మా లుక్ వరకు అన్నీ ఆయనే చూసుకొనేవారు’’ అని తెలిపింది.


ఇటీవలే ఈ సినిమా నుంచి ‘‘అబ్బా అబ్బా..’’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో దీపిక పిల్లి, విష్ణు ప్రియ, వసంతి, నిత్యశెట్టిలు అందాలు ఆరబోశారు. ఈ చిత్రానికి పీఆర్ సంగీతం, లిరిక్స్ అందించారు. ఈ పాటను హారిక నారాయణ్, శ్రీకృష్ణ ఆలపించారు. ఈ చిత్రంలో ఇంకా ఆమని, తణికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. సాయిబాబా కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మాతలు.






Also Read: లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?
Also Read: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!