Telangana Budget Allocations 2024: తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో గురువారం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో పూర్తి పద్దును శాసనసభలో ప్రవేశపెట్టారు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై ఎక్కువ ఫోకస్ చేసిన ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా వ్యవసాయం రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థిక లోటు అంచనా రూ.49,255.41 కోట్లు కాగా.. ప్రాథమిక లోటు అంచనా రూ.31,525.63 కోట్లుగా ఉంది. రెవెన్యూ మిగులు అంచనా రూ.297.42 కోట్లు. అలాగే పన్ను ఆదాయం రూ.1,38,181.26 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208.44 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా రూ.26,216.28 కోట్లు, కేంద్రం గ్రాంట్లు 21,636.15 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. నిజాం షుగర్స్ తిరిగి ప్రారంభిస్తామని భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్ట్ 2 వరకూ కొనసాగనుండగా.. శుక్రవారం అసెంబ్లీకి సెలవు. ఈ నెల 27న (ఆదివారం) బడ్జెట్‌పై చర్చ సాగనుంది.


ఆరు గ్యారెంటీలకు నిధుల కేటాయింపులు



  • మహాలక్ష్మి - ఉచిత రవాణా పథకం: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఇప్పటివరకూ 68.60 కోట్ల ప్రయాణాలను మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేశారు. పర్యవసానంగా వారికి రూ.2,351 కోట్లు ఆదా అయ్యింది. ఈ పథకానికి అయ్యే ఖర్చు RTCకి ప్రభుత్వం నెలవారీగా చెల్లిస్తుంది. 

  • రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా ఇప్పటివరకూ 39,57,637 కుటుంబాలకు లబ్ది చేకూరింది. ప్రభుత్వం ఈ పథకానికి రూ.200 కోట్లు వెచ్చించగా.. ఈ బడ్జెట్‌లో రూ.723 కోట్లు ప్రతిపాదించారు.

  • గృహజ్యోతి పథకాన్ని ఈ ఏడాది మార్చి 1 నుంచి అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం జులై 15 నాటికి, 45,81,676 ఇళ్లల్లో వెలుగులు నింపిందని.. ఈ పథకం కింద డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.583.05 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈ బడ్జెట్‌లో రూ.2,418 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలు ఇండ్లను కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించామని భట్టి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇండ్ల చొప్పున, మొత్తం 4,50,000 ఇండ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించామన్నారు. 'ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో, ఆర్.సి.సి (RCC) కప్పుతో వంట గది, టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి. 2 పడక గదుల ఇండ్ల పథకం క్రింద పూర్తైన ఇండ్లను త్వరలోనే కేటాయిస్తాం.' అని పేర్కొన్నారు.


ఆరు గ్యారెంటీల అమలుకు ప్రాధాన్యం ఇవ్వడ సహా వ్యవసాయం, నీటి పారుదల రంగం, విద్య, వైద్యం, పారిశ్రామిక, ఐటీ అభివృద్ధి, విద్యుత్ రంగం, స్త్రీ శిశు సంక్షేమం, పశు సంవర్థకం వంటి రంగాలపై సర్కారు ఎక్కువ ఫోకస్ చేసింది.


Also Read: Telangana Budget 2024-25: తెలంగాణలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన భట్టి విక్రమార్క - రూ.2,91,159 కోట్లతో పద్దు