Telangana Budget 2022-23 LIVE: అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు RRR సస్పెన్షన్, ఈ సెషన్ పూర్తయ్యేదాకా నో ఎంట్రీ!

Telangana Budget 2022-23 Live Updates: తెలంగాణ బడ్జెట్‌‌ను సోమవారం (మార్చి 7) ఉదయం 11.30 గంటలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టనున్నారు.

ABP Desam Last Updated: 07 Mar 2022 11:53 AM
హైదరాబాద్‌ మెట్రోకు ఆర్థిక సాయం

‘‘ఎయిర్ పోర్టు మెట్రో కనెక్టవిటీకి ఈ బడ్జెట్ లో రూ.500 కోట్లు  కేటాయించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో రూ.1500  కోట్లు కేటాయించడం జరిగింది.’’ అని హరీశ్ రావు అన్నారు.

హైదరాబాద్‌లో అభివృద్ధి పనులు ఇవీ

‘‘జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల మరమ్మతు పనులు రూ.858 కోట్లతో జరుగుతున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ రూ.387 కోట్ల రూపాయలతో సర్వీసు రోడ్డు నిర్మాణం అవుతోంది. రూ.36.5 కోట్లతో గండిపేట చెరువును మరింత అభివృద్ధి చేస్తున్నాం. రూ.1450 కోట్లతో సుంకిశాల నుంచి క్రిష్ణా జలాలకు హైదరాబాద్‌కు వచ్చే పైపు లైన్‌ నిర్మాణం జరుగుతోంది. దీనికి ఈ బడ్జెట్‌లో రూ.725 కోట్లు కేటాయిస్తున్నాం. హైదరాబాద్ సీవరేజ్ ట్రీట్‌మెంట్ కోసం రూ.3,866 కోట్లు ఖర్చు చేస్తున్నాం.’’

సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే రూ.3 లక్షలు సాయం

‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి రూ.3 లక్షల సాయం చేస్తాం. నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతుంది. వీటిలో 3.50 లక్షల ఇళ్లు ఎమ్మెల్యేల పరిధిలో ఉంటాయి. మిగిలిన 43 వేల ఇళ్లు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వాసితులకు, ప్రమాద బాధితులకు కేటాయించేందుకు వీలుగా సీఎం పరిధిలో ఉంటాయి.’’ అని హరీశ్ రావు తెలిపారు. 

ఆర్థిక వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ నెం.1

‘‘ఇది అంతా కేసీఆర్ మార్కు బడ్జెట్. 2021-22 నాటికి జీఎస్డీపీ రూ.11,54,860 కోట్లుగా ఉంది. 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్డీపీ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. 2015-16 నుంచి 2020-21 మధ్య సగటున 11.7 శాతం ఆర్థిక వృద్ధి జరిగింది. ఈ ఆర్థిక వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ అగ్రగామిగా ఉంది.’’ అని హరీశ్ రావు అన్నారు.

Telangana Budget: ఆదాయ మార్గాలు (అంచనా)

* పన్ను ఆదాయం - రూ.1,08,212 కోట్లు
* కేంద్ర పన్నుల్లో వాటా - రూ.18,394 కోట్లు
* పన్నేతర ఆదాయం - రూ.25,421 కోట్లు
* గ్రాంట్లు - రూ.41,001 కోట్లు
* రుణాలు - 53,970 కోట్లు
* అమ్మకం పన్ను అంచనా - రూ.33 వేల కోట్లు
* ఎక్సైజ్ ద్వారా ఆదాయం - రూ.17,500 కోట్లు
* స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం - రూ.15,600 కోట్లు

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాకౌట్

Telangana Congress Walkout: గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడంపై కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. ఈ మేరకు వారు సభ నుంచి వాకౌట్ చేశారు.

BJP MLAs Protest: అసెంబ్లీ ఎదుట బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

తెలంగాణ అసెంబ్లీలో సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేలు గేటు బయట నిరసనకు దిగారు. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ ముగ్గురూ అసెంబ్లీ ఎదుట ఎండలో బైఠాయించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు.

Telangana Budget Allocations: వివిధ రంగాలకు కేటాయింపులు

* నీటి పారుదల రంగానికి రూ.22,675 కోట్లు
* ఆసరా పింఛన్ల పథకానికి రూ.11,728 కోట్లు
* కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూ.2,750 కోట్లు
* 9,123 స్కూళ్లలో మన ఊరు - మనబడికి రూ.3,497 కోట్లు
* డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు
* రోడ్లు, భవనాల కోసం రూ.1,542 కోట్లు
* ఫారెస్ట్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు
* బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.177 కోట్లు
* బీసీ సంక్షేమం కోసం రూ.5,698 కోట్లు
* ఎస్టీల సంక్షేమం కోసం 12,565 కోట్లు

తెలంగాణ బడ్జెట్ స్వరూపం ఇదీ

* తెలంగాణ బడ్జెట్ రూ.2,56,958 కోట్లు
* రెవెన్యూ వ్యయం 1,89,274.82 కోట్లు
* పెట్టుబడి వ్యయం రూ.29,728.44 కోట్లు
* దళిత బంధుకు రూ.17,700 కోట్లు
* దళిత బంధు ద్వారా ఈ ఏడాది 11,800 కుటుంబాలకు లబ్ధి
* గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ.227.5 కోట్లు
* వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు
* హరిత హారానికి రూ.932 కోట్లు
* పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1394 కోట్లు
* పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు
* అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు
* కొత్త వైద్య కళాశాలలకు రూ.వెయ్యి కోట్లు
* మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్ కాలేజీలు
* సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం
* తెలంగాణలో పామాయిల్ సాగుకు ప్రోత్సాహం, ఇందుకు రూ.వెయ్యి కోట్లు
* రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు లక్ష్యం

రైతులకు గుడ్ న్యూస్, పంట రుణాలు మాఫీ

* రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ
* వచ్చే ఆర్థిక ఏడాది నుంచి రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ 
* మొత్తం పంట రుణాలు రూ.16,144 కోట్లు మాఫీ
* విడతల వారీగా 5.12 లక్షల మంది రైతులకు రుణాల మాఫీ ద్వారా లబ్ధి

BJP Leaders Suspension: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక  మంత్రి హరీశ్ రావు ప్రసంగం సందర్భంగా తీవ్ర ఆటంకం కలిగించినందుకు గానూ బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం సస్పెండ్ చేశారు. రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావును సభ వదిలి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం చదువుతుండగా మంత్రి తలసాని శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలనే తీర్మానం ప్రవేశపెట్టగా.. స్పీకర్ దానికి ఆమోదించారు. ఈ సెషన్ మొత్తం వారిని సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ వెల్లడించారు.

‘అది తెలంగాణ ప్రభుత్వ విధానం కానే కాదు’

‘‘కరోనాతో సంక్షోభం ఎదురైనా కేంద్రం రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కంటితుడుపుగా షరతులతో కూడిన రుణ పరిమితి పెంచింది. రైతుల నుంచి కరెంటు ఛార్జీలు వసూలు చేయాలని షరతు పెట్టింది. అది తెలంగాణ ప్రభుత్వ విధానం కానేకాదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎందుకంటే తెలంగాణ రైతు బిడ్డ పాలిస్తున్న ప్రభుత్వం. అంతా శుష్కప్రియాలు.. శూన్య హస్తాలే. పన్నుల రూపంలో 41 శాతం తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాలి. కానీ దొడ్డి దారిన పన్నులు వసూలు చేస్తోంది. కేంద్రం ఈ నిర్వాకాన్ని 15వ ఆర్థిక సంఘం కూడా తప్పుబట్టింది’’

కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు

‘‘పార్లమెంటులో తెలంగాణ గురించి చర్చకు వచ్చిన ప్రతిసారి తల్లిని చంపి బిడ్డను బతికించారని అంటున్నారు. ఏ విషయంలోనూ కేంద్రం సహకారం లేదు. తెలంగాణకు రావాల్సిన ఐటీఆర్‌ భారీ ప్రాజెక్టును తప్పించి కేంద్రం భారీ తప్పు చేసింది. కేంద్ర సర్కారుకు ఎన్ని ప్రతిపాదనలు పంపినా, విన్నవించుకున్నా సహకారం లేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్  సిఫార్సు చేసినా కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీలూ నెరవేర్చలేదు.’’

ఇప్పుడు తెలంగాణ టార్చ్ బేరర్: హరీశ్ రావు

బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘‘ప్రజలు కేసీఆర్ నాయకత్వం పట్ల మక్కువ చూపుతున్నారు. గతంలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. అవమాన చరిత్ర నుంచి ఆత్మగౌరవం దిశగా దూసుకుపోతుంది. ఇప్పుడు తెలంగాణ టార్చ్ బేరర్. ఇప్పుడు తెలంగాణ వ్యవహరిస్తున్నది.. రేపు భారత్ అనుసరిస్తున్నది.’’ అని అన్నారు.

Telangana Assembly: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే జాతీయ గీతాలాపన అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు ప్రారంభం కావడంపై విపక్ష నేతలు నినాదాలు చేశారు. అయినా హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

Eatala Rajender: మేం ముగ్గురమే, అయినా అందరి దృష్టి మాపైనే

రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదని బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకుండా సీఎం కేసీఆర్‌ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఎమ్మె్ల్యేలు ముగ్గురే ఉన్నా అంతా తమవైపే చూస్తున్నారని అన్నారు.

Telangana BJP: అమరవీరుల స్తూపానికి బీజేపీ నేతల నివాళులు

తెలంగాణ బడ్జెట్‌ (Telangana Budget) సమావేశాల సందర్భంగా గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌, రఘునందన్‌ రావు నివాళులు అర్పించారు. రాజాసింగ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రాజ్యంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్‌కు అసలు విలువ ఇవ్వడమే లేదని ఆరోపించారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్‌ అరాచకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రశ్నలకు శాసనసభలో కేసీఆర్‌ నుంచి కనుక సమాధానం రాకపోతే అక్కడే తేల్చుకుంటామని రాజాసింగ్‌ హెచ్చరించారు.

Telangana Congress: ప్రారంభమైన సీఎల్పీ భేటీ

మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సి వ్యూహంపై సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Harish Rao in Assembly: అసెంబ్లీకి చేరుకున్న మంత్రి హరీష్

మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్ (Telangana Budget) ప్రవేశపెట్టనున్న వేళ ఆర్థిక మంత్రి హరీష్‌రావు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సభాపతి, కౌన్సిల్ ఛైర్మన్‌ను మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకు ముందు కోకాపేటలోని తన నివాసం నుంచి బయలుదేరిన మంత్రి హరీష్‌ రావు ఫిలింనగర్‌లోని దైవసన్నిదానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 11:30 గంటలకు శాసన సభలో మంత్రి హరీష్‌, శాసన మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Minister Harish on TS Budget: అన్ని వర్గాలకు అనుకూలంగా తెలంగాణ బడ్జెట్: Harish Rao

సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఆర్థిక మంత్రి హోదాలో మూడోసారి అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నానని మంత్రి హరీష్ రావు సోమవారం ఉదయం అన్నారు. కోకాపేట్‌లోని ఆయన నివాసం వద్ద విలేకరులతో హరీష్ రావు మాట్లాడారు. ఉదయం 11:30 గంటలకు శాసన సభలో తాను, మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పారు. అన్ని వర్గాలకు సమాన న్యాయం చేసేలా మానవీయ కోణంలో ఈ బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు.

Background

Telangana Budget LIVE Updates: తెలంగాణ బడ్జెట్‌ 2022-23ను (Telangana Budget 2022-23) సోమవారం ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు (Harish Rao), మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి గవర్నర్‌ (Telangana Governor) ప్రసంగం లేకుండానే ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ సమావేశాలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 1,200 మంది పోలీసులు అసెంబ్లీ సమావేశాల బందోబస్తులో ఉంచారు. 


ఆదివారం (మార్చి 6) ప్రగ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షత‌న ఆదివారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ స‌మావేశంలో బ‌డ్జెట్ ప్రతిపాద‌న‌ల‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాబడులు, ఆదాయవ్యయాలు, బడ్జెట్ కేటాయింపులు, ఏడాది కాలంలో ప్రభుత్వ ప్రణాళికలను సీఎం కేసీఆర్ మంత్రులకు వివరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2.31 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత ఏడాది బడ్జెట్ తో పోలిస్తే 2022-23 రాష్ట్ర బడ్జెట్ కనీసం 10-15 శాతం పెరుగుదల ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దళితుల బంధు కార్యక్రమానికి భారీ కేటాయింపులు చేయడంతో పాటు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం వరాలు కురిపిస్తోందని సమాచారం.


ఇదే చివరి బడ్జెట్ (TS Budget 2022-23)!


2023 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ అయినందున సీఎం కేసీఆర్ బడ్జెట్ అమలుపై మంత్రులకు వివరించారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేసిన అంశాన్ని కూడా కేబినెట్ లో చర్చించినట్లు సమాచారం. ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు మంత్రులతో పాటు అధికారులందరినీ పూర్తి సమాచారంతో అసెంబ్లీకి రావాలని  మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కోరినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలను ఉపయోగించుకుని రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను బట్టబయలు చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.


గవర్నర్ తమిళిసై ఆగ్రహం (Governor Tamilisai)


తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం (Governor Speech) లేకపోవడంపై తమిళిసై స్పందించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల్లో(Budget Session) గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ (Assembly) సమావేశాల కొనసాగింపులో భాగంగానే బడ్జెట్ సమావేశాలు ఉంటాయని ప్రభుత్వం చెప్పడం సరికాదని గవర్నర్ అన్నారు. ఐదు నెలల తర్వాత సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం, గత సమావేశాల కొనసాగింపు అనడం రాజ్యాంగానికి విరుద్ధం అన్నారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించడమే అని తమిళి సై అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు గమనించాలని గవర్నర్‌ (Governor Tamilisai) కోరారు. రాజకీయాలకు అతీతంగా ఫెడరల్ స్ఫూర్తిని కొనసాగిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశామన్నారు. సిఫార్సుకు సమయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఉందని తమిళి సై అన్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.