BJP Plan In Telangana :  తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి బీజేపీ ఇప్పటి వరకూ దూకుడుగా వెళ్లింది. రాష్ట్ర స్థాయిలో బజ్ తెచ్చుకుంది కానీ.. నియోజకవర్గ స్థాయిలో బలపడలేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు ఇక క్షేత్ర స్థాయిలో బలపడాలన్న ఆలోచన చేస్తోంది. అందుకే.. గ్రామ, గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల  బలోపేతం వంటి వాటితో  ఇక క్షేత్ర స్థాయి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని నిర్ణయించారు. ముఖ్య నాయకుల పాదయాత్రలు, బస్సు యాత్రల సంగతి ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లుగా తెలుస్తోంది.


ఫిబ్రవరి నుంచి స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు 


ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి ఏకంగా 11 వేల సభలు, సమావేశాలు నిర్వహంచాలని నిర్ణయించారు. అలాదే  119 నియోజక వర్గాల తెలంగాణలో  9 వేల శక్తికేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.  ప్రతి 56 బూత్‌ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఉంటుంది.  ప్రతి గ్రామంలో కాషాయ జెండాలు కనిపించేలా శక్తికేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ప్రతి శక్తి కేంద్రానికి ప్రముఖ్‌ను నియమించారు.  బూత్‌ స్థాయిలో ఎలక్షన్‌ ఇంజనీరింగ్‌ చేసేందుకు ఈ కమిటీలు ఉపయోగపడతాయి.  ఫిబ్రవరి నుంచి ప్రతి రోజూ ప్రజల కళ్ల ముందు కనిపించేలా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. 


ఫిబ్రవరిలో మోదీ, అమిత్ షా పర్యటనలు 
 
ఫిబ్రవరిలో ప్రధాని మోదీ, హూంమంత్రి అమిత్‌ షా వంటి అగ్రనేతలు సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు.  నేతల కొరతను అధిగమించేందుకు ఇతర పార్టీల్లో  నేతలను చేర్చుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో .. చేర్చుకునే విషయంలో మాత్రం ఆలోచన చేస్తుననట్లుగా చెబుతున్నారు.  ఏ పదవిలోనూ లేని పొంగులేటి శ్రీనివాస రెడ్డి వంటి ప్రజాబలం కలిగిన నేతల విషయంలో వ్యతిరేకత ప్రభావం ఉండదని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి. 


కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత పార్టీలో భారీ మార్పు !


కేంద్ర మంత్రివర్గంలో త్వరలో మార్పు చేర్పులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. పార్టీలోనూ  పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ఉంటాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.  తెలంగాణలో అధికారం సాధించడంతో పాటు సార్వ త్రిక ఎన్నికల్లో కనీసం 12 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.  కేబినెట్‌లో జరిగే మార్పుల్లో తెలంగాణకు ప్రాధాన్యత ఉంటుం దని .. మరో కేంద్ర మంత్రి పదవి లభించవచ్చని అంటున్నారు. అదే జరిగితే రాష్ట్ర నాయకత్వంలోనూ మార్పులు వస్తాయి. మొత్తంగా బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.  దక్షిణాదిలో బీజేపీ అధికారం చేపట్టబోయే రెండో రాష్ట్రం తెలంగాణే కావాలని బీజేపీ పెద్దలు పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది.  ఇటీవల కొన్ని కేసుల వ్యవహారాల్లోనూ.. బీజేపీ పెద్దలు ఇబ్బంది పడటంతో  మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా చెబుతున్నారు.