రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రో ధరలతో పాటు కాలుష్య రహిత ప్రయాణం మీద ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో వాహన మార్కెట్ అంతా EVల మీదే ఆధారపడి ముందుకు సాగుతుందని పలు వాహన తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ విస్తరణకు భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి.


ఎలక్ట్రిక్ వాహనాలతో పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు, పెద్ద మొత్తంలో పన్నుల నుంచి మినహాయింపు పొందే అవకాశం లభిస్తోంది. ఇంతకీ ఎలక్ట్రిక్ వాహనాలపై ఎంత మొత్తంలో ట్యాక్స్ మినహాయింపు ఉంటుందో తెలుసుకుందాం. 


కొనుగోలుదారులకు ఎంతో మేలు


తాజాగా Hyundai Ioniq 5, MG Euniq 7, Kia KA4, BYD Atto 3 సహా పలు ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) ఆటో ఎక్స్‌ పో- 2023లో ప్రదర్శనకు పెట్టారు. అంతేకాదు, తాజా ఆటో ఎక్స్‌పోలో పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. దేశంలోని ఆటో ఔత్సాహికులు భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకే మొగ్గుచూపుతారనే స్పష్టమైన సంకేతాలను ఈ ఆటో ఎక్స్ పో ఇస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు  రోడ్లపై తిరుగుతున్నాయి. 2022లో అమ్మకాలు ఏకంగా 210 శాతం పెరిగినట్లు(YoY) నివేదికలు వెల్లడిస్తున్నాయి. EVలు అతి తక్కువ కార్బన్ ఫుట్‌ ప్రింట్‌ తో పర్యావరణానికి మంచివి అయితే, కస్టమర్లు లక్షల రూపాయల పన్ను నుంచి మినహాయింపు పొందడంలో సాయం చేస్తున్నాయి.  


సెక్షన్ 80EEB ప్రయోజనాలు


యూనియన్ బడ్జెట్ 2019లో, కేంద్రం EVని కొనుగోలు చేయడానికి తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీకి సులభ మినహాయింపును అందించే సెక్షన్ 80EEB (AY 2020-21 నుంచి ప్రారంభం)ని ప్రకటించింది. దీని ద్వారా పలు రాయితీలను పొందే అవకాశం ఉంటుంది.


పన్ను మినహాయింపుకు అర్హత ఏంటంటే?


సెక్షన్ 80EEB కింద పన్ను మినహాయింపు వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. సంస్థలకు ఎలాంటి మినహాయింపులు ఉండవు.


ఎంత మొత్తంలో మినహాయింపు లభిస్తుంది?


సెక్షన్ 80EEB కింద రూ. 1.5 లక్షల వరకు వడ్డీ చెల్లింపులు తీసేస్తారు.


కాల పరిమితి ఎంత?


రుణం చెల్లించే మొత్తం కాలానికి మినహాయింపు అందుబాటులో ఉంటుంది.


పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పెంచే అవకాశం!


సెక్షన్ 80EEB మార్చి 31, 2023లోపు కొనుగోలు చేసిన EVలకు వర్తిస్తుంది. అయితే, రాబోయే బడ్జెట్ 2023తో  ఈ పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని మరో రెండేళ్లు అంటే మార్చి 31, 2025 వరకు పొడిగించవచ్చని తెలుస్తోంది.


జీఎస్టీ, రోడ్డు ట్యాక్స్ తగ్గింపు


ఎలక్ట్రిక్ వాహనాల అమ్మాకాలపై అదనపు ప్రోత్సాహకంగా కేంద్రం GSTని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. అనేక రాష్ట్రాలు EV కొనుగోళ్లపై రహదారి పన్నును కూడా మాఫీ చేశాయి. 1.5 లక్షల వరకు రోడ్డు పన్నుపై సబ్సిడీని మహారాష్ట్ర ప్రకటించింది. నవంబర్ 2022లో అదనంగా మూడు సంవత్సరాల పాటు EVలకు 100 శాతం రోడ్డు పన్ను మినహాయింపును పొడిగించాలని తమిళనాడు ప్రతిపాదించింది.


Read Also: 2022లో భారత మార్కెట్లో విడుదలైన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!