Munugode ByElection :  మునుగోడు ఉపఎన్నికను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కమిటీ వేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. తెలంగాణలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై బీజేపీ కోర్ కమిటీ సమావేశం అయింది.  కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో చర్చించి పూర్తిస్థాయిలో మునుగోడు ఉప ఎన్నిక కమిటీ వేయాలని నిర్ణయించారు.  ఈ నెల 11న మునుగోడుకు బండి సంజయ్‌ వెళ్లనున్నారు. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఈ నెల 15న చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి అసెంబ్లీ వద్ద ఉన్న సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం వరకు భారీగా బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు భాజపా ఆధ్వర్యంలో ప్రతి మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. 


మరో వైపు నిజామాబాద్ బహిరంగసభలో కేసీఆర్ చేసిన విమర్శలకు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ కౌంటర్ ఇచ్చారు.  అబద్ధాలను వల్లె వేస్తూ కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.  కేంద్ర ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలు తీవ్ర అభ్యంతరకరం, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని చుగ్ విమర్శించారు.   జాతీయ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకునే హక్కు కేసీఆర్ కు ఉంది, కానీ దానిని అడ్డం పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు.  కేసీఆర్ అసంబద్ధ విధానాలతో ఇప్పటికే తెలంగాణ డిస్కమ్‌లను అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. అది చాలదన్నట్టు జాతీయ స్థాయిలోని సంస్థలను దివాళా తీయించాలని కేసీఆర్ చూస్తున్నాడని మండిపడ్డారు.  


వ్యవసాయ పంపులకు మీటర్లు పెడుతారన్న దాని గురించి కేసీఆర్ తప్పితే ఎవరూ మాట్లాడడం లేదు. కేసీఆర్ మాత్రం ప్రతి మీటింగులో మోటార్లకు మీటర్ల పెడుతారంటూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.  పదేపదే ఒకే అబద్ధాన్ని చెప్తే ప్రజలు అది నిజమని భావిస్తారనేది కేసీఆర్ ఆలోచనలా కనిపిస్తోంది. కాని ప్రజలు వాస్తవానికి, అబద్ధానికి తేడా తెలియని అమాయకులు కాదు. కేసీఆర్ ప్రజలను తక్కువ అంచనా వేయడం మానితే మంచిదన్నారు. ఏ తప్పూ చేయకుంటే కేసీఆర్ సీబీఐ, ఈడీలను ఎందుకు పదేపదే ప్రస్తావిస్తున్నాడు? అతని మనసు మూలల్లో ఎక్కడో ఏదో తప్పు చేసిన భావన ఉంది. అందుకే భయంతో సీబీఐ, ఈడీ పేర్లను జపిస్తున్నారు... ఒకవేళ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతారు? సీబీఐ, ఈడీలకు భయపడనని పదే పదే చెప్పడంలోనే ఆయనలో నెలకొన్న భయానికి అద్దం పడుతోంది. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ వ్యవహారశైలి చూస్తుంటే అతను తప్పు చేసినట్టు రూఢీ అవుతోంది. అంతేకాక భయపడుతున్నట్టూ తెలుస్తోందని విమర్శించారు.


కేసీఆర్ కు రాజ్యాంగ వ్యవస్థలపైనా నమ్మకం లేనట్లుంది. నేరస్థులను పట్టుకునేందుకు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలు సీబీఐ, ఈడీలను పదేపదే వివాదాల్లో లాగి, వారిని భయభ్రాంతులకు గురిచేయాలని కేసీఆర్ చూస్తున్నారు. కాని కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు. వాస్తవాలను బట్టే వారు తమ పని కొనసాగిస్తారన్నారు.   కేసీఆర్ కు తెలంగాణలో స్థానం లేదు. తెలంగాణ ప్రజలు ఆయనకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం ఆయనకూ అర్థమైంది. అందుకే ఆయన ఢిల్లీ వెళ్దామనుకుంటున్నారు. సొంత రాష్ట్రంలో స్థానం లేని వ్యక్తికి ఢిల్లీ ఎలా స్వాగతం పలుకుతుందని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ దిల్లీలో చాలామందే పెద్ద క్యూ కట్టారు. కేసీఆర్ కూడా ఆ క్యూలో నిల్చొవచ్చు. కాని ప్రచారం కోసం చట్టబద్ధమైన సంస్థలను రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదని కేసీఆర్ కు నా సలహా. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని చుగ్ స్పష్టం చేశారు.