Telangana Assembly Live Updates: విద్యుత్‌ సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేడు (సెప్టెంబరు 12) ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి. సభలో జరిగే అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ చూడవచ్చు.

ABP Desam Last Updated: 12 Sep 2022 12:01 PM
KCR Speech: కనీస విద్యుత్ వినియోగం జరగడం లేదు - కేసీఆర్

‘‘మన దేశంలో స్థాపిత విద్యుచ్ఛక్తి 4,07,178 మెగావాట్లు. బేస్ పవర్ లోడ్ 2,42,890 మెగావాట్లుగా ఉంది. ఈ దేశం అత్యధికంగా విద్యుత్ వినియోగించింది.. 2,10,793 మెగావాట్లు మాత్రమే. ఇటీవలే జూన్ 22న ఇది నమోదైంది. బేస్ పవర్ లోడ్ అంటే కనీస విద్యుత్ వినియోగాన్ని కూడా మన దేశంలో వినియోగించడం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే’’

KCR Speech: హిట్లరే కాలగర్భంలో కలిసిపోయాడు - కేసీఆర్

‘‘వ్యవసాయం తన వల్ల కాదని రైతులు చేతులెత్తేసే కుట్ర జరుగుతోంది. ధాన్యం కొనాలని అడిగితే కాదంటున్నారు. వీళ్లు కాలగర్భంలో కలిసి పోతారు. భరతమాత గుండెకు గాయం అవుతోంది. అంటే వీరికి పోయే కాలం వచ్చింది. షిండేలు, బొండేలు ఎంత మంది వచ్చినా ఎవరు భయపడరు. హిట్లర్ లాంటి వాడే కాలగర్భంలో కలిసిపోయాడు’’ అని కేసీఆర్ శాసనసభలో మాట్లాడారు.

KCR: మీటర్లు పెడితే తీవ్ర వ్యతిరేకత

పొలాలకు శ్రీకాకుళంలో మీటర్లు పెడితే రైతులు సెంటర్లలో కుప్ప వేసి కాల్చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోనూ కొన్ని జిల్లాల్లో పొలాల్లో మీటర్లు పెడితే కరెంటు ఆఫీసుల ఎదుట తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇది సంస్కరణ కాదు, అందమైన అబద్ధం. మీటర్లు లేకుండా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వొద్దని విద్యుత్ చట్టంలో ఉంది. తెలంగాణ ఆర్టీసీని అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖలు వస్తున్నాయి. వాళ్లు ప్రభుత్వ సంస్థలు అమ్మినట్లు మనల్ని కూడా అమ్ముకోమంటున్నారు’’ అని కేసీఆర్ విమర్శించారు.

KCR In Assembly: మోదీ ఫాసిస్ట్ లాగా వ్యవహరిస్తున్నారు - కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. దేశంలో మోదీని విమర్శిస్తున్న తొలి ముఖ్యమంత్రి తానే అని అన్నారు. ఆయన ఫాసిస్ట్ లాగా వ్యవహరించారని, తెలంగాణ పట్ల కర్కశంగా ప్రవర్తించారని అన్నారు. కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. మోదీ ప్రధాని అయ్యాక తొలి కేబినెట్ లోనే తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో కలిపారని అన్నారు.

TS Assembly Session: విద్యుత్‌ సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లు - పర్యవసానాలపై లఘు చర్చను ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ప్రారంభించారు. ఇదే అంశంపై మండలిలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి లఘు చర్చను ప్రారంభించారు.

TS Assembly Session: అసెంబ్లీలో పలు బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు

ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బీ భూపతిరావు మృతికి సంతాపంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. 2 నిమిషాలపాటు సభ సంతాపం తెలిపింది. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతోపాటు మున్సిపల్‌శాఖ చట్ట సవరణ, అజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ బిల్లులను మంత్రి కేటీఆర్‌, వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణకు సంబంధించిన బిల్లును మంత్రి హరీశ్‌రావు, అటవీ యూనివర్సిటీ బిల్లును మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు సంబంధించిన బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మోటర్‌ వెహికిల్స్‌ టాక్సేషన్‌ సవరణ బిల్లులును మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రవేశపెట్టారు. విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తిరస్కరించారు.

TS Assembly Schedule: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి (రెండవ రోజు) పూర్తి షెడ్యూల్

  • ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం.

  • అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉభయ సభల ముందు ఉంచుతారు

  • సభ ముందు విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్ రెడ్డి ఈ నివేదికలు ఉంచుతారు 


1) సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ యాన్యువల్ రిపోర్టు


2) తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రిపోర్ట్


3) తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్


4) తెలంగాణ స్టేట్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రిపోర్ట్ లు సభలో టేబుల్ చేస్తారు.



  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష రిపోర్టు సభ ముందు ఉంచుతారు.

  • పాలేరు మాజీ శాసనసభ్యులు దివంగత భీమపాక భూపతి రావుకు సంతాపం

  • రెండో రోజు శాసనసభలో ఏడు బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.


1) తెలంగాణ జీఎస్టీ అమెండ్ మెంట్ బిల్ 2022 సీఎం కేసీఆర్ ఇంట్రడ్యూస్ చేస్తారు


2) ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టర్మినేషన్ అండ్ ల్యాండ్ రెగ్యులేషన్ అఫ్ లిజ్) బిల్లు 2022 మంత్రి కేటీఆర్ ఇంట్రడ్యూస్ చేస్తారు.


3) ది తెలంగాణ మున్సిపల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2022ను మంత్రి కేటీఆర్ ఇంట్రడ్యూస్ చేస్తారు.


4) ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ అండ్ సూపర్ న్యూఎషన్.. అమెండ్మెంట్ బిల్ 2022.. ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇంట్రడ్యూస్ చేస్తారు.


5) ది యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్ 2022 మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి ఇంట్రడ్యూస్ చేస్తారు.


6) ది తెలంగాణ యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్ 2022 మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంట్రడ్యూస్ చేస్తారు.


7) ది తెలంగాణ మోటార్ వెహికల్ టాక్సేషన్ అమెండ్మెంట్ బిల్ 2022 మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రవేశపెడతారు.


శాసనసభలో, మరియు శాసనమండలిలో.. స్వల్పకాలిక చర్చలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బిల్ రెమ్యూనిఫికేషన్ పై చర్చిస్తారు. రెండో రోజు అసెంబ్లీ, మండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని సస్పెండ్ చేశారు.

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం

తెలంగాణలో ఐదు రోజుల గ్యాప్ తర్వాత నేడు శాసనసభ, శాసనమండలి తిరిగి నేడు సమావేశం అయింది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం అయింది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లుపై ఉభయసభల్లో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే బిల్లుపై చర్చిస్తాయి. చర్చ ద్వారా రాష్ట్ర అభిప్రాయాన్ని కేంద్రానికి తెలుపనున్నారు.

Background

Telangana Assembly Live Updates: గత మంగళవారం (సెప్టెంబరు 6) తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ కాసేపట్లోనే వాయిదా పడింది. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్ధన్ రెడ్డిల మృతికి  తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. అనంతరం తమ శాఖల సంబంధించిన నివేదికను తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ నెల 12వ తేదీకి అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో పురపాలక చట్ట సవరణ సహా 6 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.


కాంగ్రెస్‌కు తగ్గిన ఓ ఎమ్మెల్యే.. 
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభానికి ముందే సీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ భేటీలో చర్చించారు. బీఎసీ సమావేశం తర్వాత మరోసారి సమావేశం కావాలని సీఎల్పీ నిర్ణయించింది. గత అసెంబ్లీ సమావేశాలతో పోల్చితే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే తగ్గారు. మునుగోడు నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సమర్పించగా, కొంత సమాయానికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖను ఆయను ఆమోదించారు. 


ఉదయం 11:30 గంటలకు ప్రారంభం, అంతలోనే సభ వాయిదా 
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్ధన్ రెడ్డిల మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. అసెంబ్లీని 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశాలలో భాగంగా తెలంగాణ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజన్సీస్ రూల్స్ 2022 బిల్లును రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సభలో ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు ఈ సమావేశాల్లో ప్యానెల్ స్పీకర్లుగా  రెడ్యా నాయక్, మోజం ఖాన్, హనుమంత్ షిండేల పేర్లను స్పీకర్ పోచారం ప్రకటించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఎసీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకొంటారు.


గోదావరి వరదలపై శాసనమండలిలో చర్చ..
ఇటీవల కురిసిన వర్షాలు, గోదావరి వరదలతో జరిగిన నష్టంపై శాసనమండలిలో చర్చ మొదలైంది. వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వివరించారు. సీఎం కేసీఆర్ సైతం ఈ ప్రాంతానికి వచ్చి స్వయంగా పరిశీలించారని గుర్తుచేశారు. భద్రాచలం ప్రాంతాల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయాలు కేటాయించినట్లు చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా సాయం అందలేదని మండలిలో వెల్లడించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.