తెలంగాణలో ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. 2022-23లో 22 లక్షల ఓట్లు తొలగించామన్న ఆయన...డెత్ సర్టిఫికెట్లు ఉన్న వాటినే ఓటర్ జాబితా నుంచి తొలగించామన్నారు. అప్లికేషన్ వచ్చిన తర్వాతే ఓటర్లను జాబితా నుంచి పేర్లు తొలగించామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాను ఎంతో పారదర్శకంగా రూపొందించినట్లు వెల్లడించారు. 


 తెలంగాణలో 3.17 మంది ఓటర్లు
తెలంగాణలో 3.17 మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ట్రాన్స్ జెండర్లు 2,557, వందేళ్లు దాటిన ఓటర్లు 7,600  మంది ఉన్నారని తెలిపారు. 8.11 లక్షల మంది యువకులు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. జులై తర్వాత దరఖాస్తు చేసుకున్న 2.21 లక్షల యువతకు ఓటు హక్కు కల్పించామన్నారు. 66 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్న రాజీవ్ కుమార్, 18 - 19 ఏళ్ల యువ మహిళా ఓటర్లు 3.45 లక్షల మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్‌ స్టేషన్‌లు 35,356 ఉండగా.. ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌లో సగటు ఓటర్ల సంఖ్య 897గా ఉందన్నారు. ఫిర్యాదుల స్వీకరణ కోసం సీ విజిల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని రాజీవ్ కుమార్ వెల్లడించారు. 


మహిళలు, పురుష ఓటర్లు సమానం
తెలంగాణాలో మహిళలు, పురుష ఓటర్లు సమానంగా ఉన్నారన్నారు. 80 ఏళ్ళు దాటిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం శుభపరిణామని, సమాజంలోని అన్ని వర్గాలను ఓటింగ్‌లో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అభ్యర్థులు ప్రచార ఖర్చును పెంచాలని పార్టీలు కోరినట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని, ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వెలిబుచ్చాయని తెలిపారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరగొచ్చని కొన్ని పార్టీలు ఆందోళన చెందాయన్నారు.


ప్రలోభాలపై పోలీసులకు సూచనలు
ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించింది సీఈసీ. సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ప్రలోభాల విషయమై అధికారులను కాస్త గట్టిగానే అప్రమత్తం చేసినట్లు తెలిసింది. దేశంలోనే ఎక్కువగా ఎన్నికల వ్యయం అయ్యే రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయన్న ఈసీ బృందం, ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకునే మొత్తం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఫిర్యాదులు పెద్ద మొత్తంలో వస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో అందుకు అనుగుణంగా డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, కానుకలు స్వాధీనం చేసుకోవడం లేదని అధికారులను హెచ్చరించినట్లు తెలుస్తోంది.  


ఎన్నికలు పూర్తి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలంటే ప్రలోభాలను అరికట్టాల్సిన అవసరం ఉందని ఈసీ అభిప్రాయపడింది. అధికారులు కూడా అందుకు అనుగుణంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశంలో క్రమంగా ఎన్నికల హింస తగ్గుతోందని, ఇదే సమయంలో ప్రలోభాలు పెరుగుతున్నాయని, హింస తగ్గేందుకు డబ్బు, మద్యం పంపిణీ కూడా ఒక కారణమని అధికారుల సమీక్షలో వ్యాఖ్యానించినట్లు సమాచారం.