Delhi Liquor Policy Case:



నిందితుల జాబితాలో ఆప్..


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై మరింత ఫోకస్ పెట్టింది ఈడీ. ఇప్పటికే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో సోదాలు చేసిన ఆయనని అరెస్ట్ చేసింది. ఇప్పుడు మొత్తం ఆమ్‌ ఆద్మీ పార్టీనే (AAP) అక్యూజ్డ్‌గా చూపిస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించనుంది. పార్టీకి అంత పెద్ద ఎత్తున అక్రమంగా నిధులు వచ్చినప్పుడు...నిందితుల లిస్ట్‌లో ఎందుకు చేర్చలేదని ఇప్పటికే సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యల ఆధారంగానే ఆ పార్టీని అక్యూజ్డ్‌గా చేర్చేందుకు అవసరమైన కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటోంది. ఈ కేసులో Prevention of Money Laundering Act (PMLA) కింద ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీ భట్టితో కూడిన ధర్మాసనం..అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజుని ప్రశ్నించింది. ఎస్‌వీ రాజు...సీబీఐ, ఈడీ తరపున కోర్టులో హాజరవుతున్నారు. అందుకే..ఆయననే ప్రశ్నించింది సుప్రీం ధర్మాసనం. 


"మీరు చెబుతున్న దాని ప్రకారం...ఈ కేసులో PMLA చట్టం వర్తిస్తుంది. పెద్ద ఎత్తున పార్టీకి అక్రమంగా నిధులు అందాయి. అలాంటప్పుడు ఆ పార్టీని ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదు..? ఈ ప్రశ్నకి ఏ సమాధానం చెబుతారు.."


- సుప్రీంకోర్టు ధర్మాసనం 


సిసోడియా బెయిల్‌పై విచారణ..


ఇప్పటికే అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా బెయిల్ కోసం పిటిషన్‌లు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇంతవరకూ అందుకు లైన్ క్లియర్ కాలేదు. ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ని నిరాకరించింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ...సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సిసోడియా. ఈ పిటిషన్‌ని విచారించిన సమయంలోనే సుప్రీంకోర్టు ఆ ప్రశ్న వేసింది. ఇప్పటికే అరెస్ట్ అయిన సంజయ్ సింగ్‌కి కోట్ల రూపాయల డబ్బులు అక్రమంగా వచ్చాయని ఈడీ తేల్చి చెప్పింది. అప్రూవర్‌గా మారిన దినేశ్ అరోరా చెప్పిన ఆధారాలతో విచారణ చేపట్టిన ఈడీ..ఈ మేరకు ఆయనకు రూ. కోట్లు వచ్చినట్టు తేల్చింది. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇదే విషయమై ఈడీ అధికారులు సీబీఐకి లేఖ రాశారు. 


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తరువాత అరెస్ట్ అయ్యేది సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అని ఢిల్లీ బీజేపీ అంటోంది. లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం అరెస్ట్ చేసింది. సంజయ్ సింగ్ అరెస్ట్ తరువాత ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. తరువాత అరెస్ట్ అయ్యేది సీఎం కేజ్రీవాల్ అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే నిజం దాచినా దాగదని, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదన్నారు. సంజయ్ సింగ్ తరువాత జైలుకు వెళ్లే నేత కేజ్రీవాల్ అనడంలో సందేహం లేదన్నారు. ఈడీ అధికారులు బుధవారం ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసానికి వెళ్లి సోదాలు చేశారు. ఈ క్రమంలో సాయంత్రం ఈడీ అధికారులు సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తర్వాత అరెస్టయిన మూడో ఆప్ నేత సంజయ్ సింగ్. 


Also Read: మోదీ చాలా తెలివైన వ్యక్తి, ఆయన వల్లే భారత్‌ దూసుకుపోతోంది - పుతిన్ ప్రశంసలు