కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీష్ రావు మరోసారి విమర్శలు చేశారు. కాషాయ పార్టీ జమిలి ఎన్నికలను నమ్ముకుంటే, కేసీఆర్ జనాన్ని నమ్ముకున్నారని తెలిపారు. హిందూ ముస్లింలకు కొట్లాట పెట్టి,  జనాన్ని పల్టీ కొట్టించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కేసీఆర్ను ముఖ్యమంత్రి చేద్దామని ప్రజలే సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని చెప్పారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కటైనా అమలు చేసిందా..? చర్చకు నేను సిద్ధమని కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. 


కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు దగ్గర పడగానే...టెంట్లు వేసి స్టంట్లు చేస్తుందన్నారు హరీశ్ రావు. టెంట్లతో స్టంట్లు వేయడమే కాంగ్రెస్ పని అన్న ఆయన, తెలంగాణపై బీజేపీకి బాధ్యత లేని మండిపడ్డారు. 19 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ప్రారంభించిన మంత్రి, ఒకప్పుడు హుస్నాబాద్‌లో అన్ని గుంతల రోడ్లు కనిపించేవని ఇప్పుడు అన్ని సీసీ రోడ్లుగా మారిపోయాయన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రూ.7,752 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. 2,500 కోట్ల రూపాయలతో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి రెండు పంటలకు ఢోకా ఉండదన్నారు. 


కాంగ్రెస్ లాంటి పార్టీలు ఎన్నికల వేల స్టంట్ చేస్తాయని...బీజేపీ ఎంపీ బండి సంజయ్ హామీలు ఇస్తారు కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేరని విమర్శించారు. తెలంగాణపై బీజేపీకి బరువు లేదు, కాంగ్రెస్ కు బాధ్యత లేదని మండిపడ్డారు. తెలంగాణలో హక్కుల గురించి ఏనాడైనా రాహుల్‌ గాంధీ మాట్లాడారా ? బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కటేనని, గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే రాహుల్‌ గాంధీ పక్క రాష్ట్రంలో పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ఉన్న పథకాలను చూసి నేర్చుకోవాలని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు. వివిధ రాష్ట్రాల్లోని నాయకులు నగరానికి వచ్చి హైదరాబాద్ నగర అభివృద్ధి, పల్లెల ప్రగతి చూడాలన్నారు. ఇండియన్ సూపర్ స్టార్డు రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు...ఇక్కడి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రశంసలు కురిపించారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌లో నిరంతరం తాగునీరు కష్టాలే ఉండేవన్నారు. తెలంగాణలో ఇచ్చినట్లు రైతు బీమా ఇవ్వండి, ఇంటింటికీ తాగు నీరు, ఉచిత 24 గంటల కరెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ బీజేపీప పార్టీలకు సవాల్ విసిరారు. 


తెలంగాణ కోసం కేంద్రంలో కొట్లాడం కాంగ్రెస్ చేతకాదు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని,కాంగ్రెస్‌ పార్టీకి ఏమాత్రం బాధ్యత లేదని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందా..? అంటూ సూటిగా ప్రశ్నించారు. నిందలు వేయడం, మతతత్వాన్ని రెచ్చగొడుతున్న బీజేపీని, అబద్ధాల కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. 


హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆల‌యాన్ని మంత్రి హ‌రీశ్‌రావు సంద‌ర్శించారు. 40 లక్షల నిధులతో ఆలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాప‌న చేశారు. సీఎం కేసీఆర్ నిఖార్సయిన హిందువు.. అందుకే రాష్ట్రం సుభిక్షంగా ఉంద‌న్నారు. కేసీఆర్ నిఖార్స‌యిన హిందువు కాబ‌ట్టే రాష్ట్రంలోని దేవాల‌యాల‌ను అభివృద్ధి చేస్తున్నార‌ని తెలిపారు.