Breaking News 24 September: సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 24న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 24 Sep 2021 08:06 PM
దివ్యాంగురాలిపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్టు

విశాఖ జిల్లాలో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన వైసీపీ నాయ‌కుడ్ని పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్ చేశారు. సీలేరుకు చెందిన దివ్యాంగ మ‌హిళ‌పై ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో అదే గ్రామానికి చెందిన నాళ్ల‌ వెంక‌ట‌రావు(40) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఒడిశా రాష్ట్రంలోకి త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుండ‌గా సీలేరు జ‌లాశ‌యం వ‌ద్ద చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నార‌ు. నాళ్లవెంకటరావును అరెస్ట్ చేసి, వైద్య ప‌రీక్ష‌ల కోసం విశాఖ‌ప‌ట్నం కేజీహెచ్‌కు త‌ర‌లించారు. న‌ర్సీప‌ట్నం కోర్టులో హాజ‌రుప‌రిచినట్లు గూడెం కొత్తవీధి సీఐ అశోక్‌ కుమార్ తెలిపారు.

సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దు

ఏపీ సీఎం జగన్‌ దిల్లీ పర్యటన రద్దైంది. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్‌ కాలు బెణికింది. సాయంత్రానికి  కూడా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం రేపటి దిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. సీఎం జగన్‌కు బదులుగా హోంమంత్రి మేకతోటి సుచరిత దిల్లీ వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగే సమావేశంలో హోంమంత్రి పాల్గొంటారు.


 

యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల.. తెలుగు వాళ్లకు 100లోపు నాలుగు ర్యాంకులు

యూపీఎస్సీ సివిల్స్ 2020 ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 761 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్‌, 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 86 మంది ఈడబ్ల్యూఎస్‌ కేటగిరి అభ్యర్థులు అర్హత సాధించారు. సివిల్స్‌లో శుభం కుమార్‌ మొదటి ర్యాంకు, జాగ్రతి అవస్థి రెండో ర్యాకు, అంకితా జైన్‌ మూడో ర్యాంకు సాధించారు. సివిల్స్‌ తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. నలుగురు అభ్యర్థులు 100లోపు ర్యాంకులు సాధించారు. తెలుగు అభ్యర్థిని పి.శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు 27వ ర్యాంకు, రవికుమార్‌ 84వ ర్యాంకు, యశ్వంత్‌ కుమార్‌రెడ్డి 93వ ర్యాంకు సాధించారు. 





దిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీకి చేరుకున్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికారు. 

ఎర్రగుంట్లలో రౌడీ షీటర్ దారుణ హత్య 

అనంతపురం జిల్లా ధర్మవరం టౌన్ ఎర్రగుంట్ల సర్కిల్ బ్రహ్మంగారి గుడి వద్ద రౌడీ షీటర్ దామోదర్ రెడ్డి(28)ని దారుణంగా హత్య చేశారు. ఎర్రగుంట్ల సర్కిల్ లో వద్ద ఉన్న దామోదర్ రెడ్డి కళ్లలో కారం కొట్టి కొడవళ్లతో నరికి హత్య చేశారు. హత్య చేసిన నిందితులు పోలీసు స్టేషన్ లో లొంగి పోయినట్టు సమాచారం. ఎర్రగుంట్లకి చెందిన కేశవ రెడ్డి కుమారుడు దామోదర్ రెడ్డి టౌన్ లో వడ్డీ వ్యాపారంచేసుకుని జీవిస్తున్నాడు. గతంలో ఇతని పైన రౌడీషీట్ ఉంది. వడ్డీ వ్యాపారస్థులు మధ్య గొడవల కారణంగా ఈ హత్య జరిగినట్టు సమాచారం.

దిల్లీకి బయలుదేరిన సీఎం కేసీఆర్ 

ప్రత్యేక విమానంలో దిల్లీకి సీఎం కేసీఆర్ బయలుదేరారు. శాసనసభ సమావేశం, బీఏసీ భేటీలో పాల్గొన్న సీఎం, అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ దిల్లీకి పయనమయ్యారు.

తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల 

తెలంగాణలో రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలు విడుదల చేశారు. ఎడ్‌సెట్‌లో 33,683 (98.53 శాతం) మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు చెప్పారు. ఉత్తీర్ణులైన వారిలో 25,983 మంది అమ్మాయిలు ఉన్నట్లు వెల్లడించారు.

మంత్రి గంగుల కమలాకర్‌కు ఊరట.. ఆయనపై అభియోగాలు కొట్టేసిన నాంపల్లి కోర్టు

2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, నేటి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలాకర్ పై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల్ని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. అడ్వకేట్ రాజేందర్ రావు గంగుల తరఫున కేసు వాదించారు. కేసు నెంబర్ 37/20లో ఏ1గా మంత్రి గంగుల.. ఇతర నేతలు చల్లా హరిశంకర్, చంద్రశేఖర్, సూర్యశేఖర్, బ్టటు వరప్రసాద్, పెద్దిరమేష్‌లపై ఎన్నికల సమయంలో అభియోగాలు నమోదయ్యాయి.  ఏ1, ఏ2 లుగా ఉన్న గంగుల కమలాకర్, చల్లా హరిశంకర్‌లు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని కొబ్బరికాయ కొట్టారని కేసు నమోదైంది. ఈ అభియోగాలను విచారించిన నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు వీరిపై అభియోగాలు నిరూపణ చేయకపోవడంతో మంత్రి గంగులతో సహా ఇతర నేతలపై నమోదు చేసిన కేసులను కొట్టివేసిన కోర్టు వారందన్నీ నిర్దోషులుగా తీర్పు వెలువరించింది.

వైఎస్సార్ విగ్రహాన్ని అపహరించిన దుండగులు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలోని కొత్తూరులో నడి రోడ్డుపై ఉన్న వైస్సార్ విగ్రహాన్ని దుండగులు అపహరించారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అపహరణకు గురైన విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్టించి, అపహరించిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్  చేశారు. 

టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం.. ఇక పోటీ చేయనని స్పష్టం

టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని కేశినేని నాని తెలిపారు. తన కూతురు కూడా పోటీ చేయరని తేల్చి చెప్పారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని తెలిపానని నాని అన్నారు. తన కుమార్తె కూడా తిరిగి టాటా ట్రస్టులోకి వెళ్లారని ఆయన అన్నారు. వేరే అభ్యర్థిని చూసుకోవాలని చంద్రబాబుకు స్పష్టం చేశానని పేర్కొన్నారు. 

ఢిల్లీలో కాల్పులు

ఢిల్లీలోని రోహిణీ కోర్టు ఆవరణలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ జితేందర్ దారుణ హత్యకు గురయ్యారు. కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఓ కేసులో రోహిణీ కోర్టుకు జితేందర్ హాజరైన సందర్భంగా దుండగులు ఈ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జితేందర్ తరపు లాయర్‌కు కూడా గాయాలయ్యాయి. లాయర్ దుస్తుల్లో వచ్చి దుండగులు కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. మరో ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





తెలంగాణ అసెంబ్లీ వాయిదా

తెలంగాణ శాసన సభ సోమవారానికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన స్పీకర్

ఇటీవల మరణించిన భ‌ద్రాచ‌లం మాజీ ఎమ్మెల్యే కుంజ బొజ్జి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మేరా చందులాల్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, క‌రీంన‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే ఎం స‌త్యనారాయ‌ణ‌రావు, వ‌ర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచ‌ర్ల జ‌గన్నాథం, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి, సుజాత న‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గార‌పు సీతారామ‌య్య, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశ‌య్యకు శాస‌న‌స‌భ‌ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.

మొదలైన అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. జాతీయ గీతాలాపన అనంతరం.. ఇటీవలి కాలంలో మరణించిన సభ, మండలి సభ్యులకు సంతాపం తీర్మానం ప్రకటించారు.

60 వేల మార్కును దాటిన సెన్సెక్స్

స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో సెన్సెక్స్ మరో కీలక మైలురాయిని చేరింది. శుక్రవారం సెన్సెక్స్‌ ఆరంభంలోనే 60 వేల పాయింట్ల మైలురాయిని సెన్సెక్స్ తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ నిఫ్టీ కూడా 18 వేల మార్కును తాకేలా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగియడం.. దేశీయంగా పలు సానుకూల పరిణామాలు ఉండడంతో సెన్సెక్స్ ఎగబాకేందుకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 375 పాయింట్ల లాభంతో 60,260 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 17,933 వద్ద ఉన్నాయి.

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ

మరికాసేపట్లో (11 గంటలకు) తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలి రోజు ఇటీవల మరణించిన మాజీ శాసనసభ, మండలి సభ్యులకు సంతాపం ప్రకటించనున్నారు. సంతాప తీర్మానాల అనంతరం ఉభయ సభలను వాయిదా వేస్తారు. అసెంబ్లీ పని దినాలు, అజెండా ఖరారు చేసేందుకు శాసనసభ, మండలి సభా వ్యవహారాల సలహా సంఘాలు (బీఏసీ) భేటీ అవుతాయి. సమావేశాల పనిదినాలు, చర్చించే అంశాలపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. వారం లేదా పది రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Background

Breaking News 24 September Live Updates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 24న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.




- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.