Breaking News Live: కుప్పం మున్సిపాలిటిలో ఉద్రిక్తత... 14వ వార్డు ఏకగ్రీవంపై రచ్చ

ఏపీ, తెలంగాణ సహా అంతర్జాతీయంగా నేడు జరిగే బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 08 Nov 2021 08:25 PM
హుజూరాబాద్ ఫలితాల పరిశీలకులుగా నంజన్యన్ మత్..

హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై అధ్యయన కమిటీ పరిశీలకుడిగా మాజీ ఎమ్మెల్యే, కర్ణాటక రాష్ట్ర సీనియర్ నాయకులు నంజన్యన్ మత్ ను ఏఐసీసీ నియమించింది. ఈ విషయాన్ని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నెల రోజులలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఏఐసీసీ ఆదేశించిందని ఆయన పేర్కొన్నారు.


 

ఈ నెల 10న వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన

ఈనెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటన చేయనున్నారు. వరంగల్-హనుమకొండ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. వరంగల్ ఔటర్ రింగ్‌రోడ్ నిర్మాణం, జిల్లాలోని మున్సిపాలిటీల్లో రోడ్ల అభివృద్ధిపై ఆరా తీయనున్నారు. జంట నగరాల్లో రైల్వే ట్రాక్‌లపై ఆర్‌వోబీల నిర్మాణంపై సమీక్షించనున్నారు. వరంగల్ ఇంటర్నల్ రింగ్‌రోడ్ పూర్తికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు.

కుప్పం మున్సిపాలిటిలో ఉద్రిక్తత... 14వ వార్డు ఏకగ్రీవంపై రచ్చ

కుప్పం మున్సిపాలిటిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కార్యాలయాన్ని తెలుగుదేశం నాయకులు ముట్టడించారు. 14వ వార్డు ఏకగ్రీవంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. 14 వార్డులో వైసీపీ అభ్యర్థిని ఏకపక్షంగా ఎలా ఏకగ్రీవం చేస్తారని టీడీపీ అధికారులని ప్రశ్నిస్తుంది.  ఎలక్షన్ నిబంధనలను అతిక్రమించిన కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ బయటకు తీయాలని నిరసన తెలిపారు. వెంటనే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దరువు ఎల్లన్న కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్

తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా బండలింగంపల్లి గ్రామంలోని బీజేపీ రాష్ట్ర నాయకుడు  దరువు ఎల్లన్నకు మాతృవియోగం కలిగింది. సోమవారం కరీంనగర్ ఎంపీ, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. దరువు ఎల్లన్నకి బండి సంజయ్ ధైర్యం చెప్పారు. 

రేపు శ్రీకాకుళం, ఒడిశాలో సీఎం జగన్ పర్యటన 

శ్రీకాకుళం, ఒడిశాలో మంగళవారం సీఎం జగన్ పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 01.15 గంటలకు పాతపట్నం చేరుకుంటారు. అక్కడ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. శ్రీకాకుళం పర్యటన ముగించుకుని విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విశాఖ నుంచి భువనేశ్వర్‌ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ నివాసంలో ఇరు రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్‌ అంశాలపై చర్చించనున్నారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లికి చేరుకోనున్నారు.

10న వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ నెల 10న వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. వరంగల్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డు, మున్సిపాలిటీల్లో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్- హన్మకొండ జంట నగరాల మధ్య రవాణా, రైల్వేట్రాక్‌లపై రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్ఓబీ)ల నిర్మాణం, తదితర అభివృద్ధి అంశాలపై స్థానిక ప్రజా ప్రజాతినిధులతో సమీక్షించనున్నారు. వరంగల్ ఇంటర్నల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, టెక్స్‌టైల్‌ పార్క్ పనుల పురోగతి అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. హనుమకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

సోమశిల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు

ఎగువన భారీగా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్ట్ కి వరదనీరు పోటెత్తింది. ప్రాజెక్ట్ కు టోటల్ ఇన్ ఫ్లో 18 వేల క్యూసెక్కులుగా ఉండగా, 20 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కింద దిగువకు వదులుతున్నారు. మొత్తం 3 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో ప్రాజెక్ట్ మీదుగా రాకపోకలు నిలిపివేశారు. ప్రాజెక్ట్ ఎగువ భాగాన చేపల వేట జోరుగా సాగుతోంది. 

4 గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేడు సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడ‌నున్నారు. నిన్న రాత్రి ప్రెస్ మీట్ నిర్వహించిన కేసీఆర్.. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై మాట్లాడిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఇతర నాయకులు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ మళ్లీ ప్రెస్ మీట్ పెడుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.


 
యాదాద్రికి విరాళంగా మంత్రి మల్లా రెడ్డి ఏడున్నర కిలోల బంగారం

యాదాద్రి ఆలయం విమాన గోపురాన్ని బంగారు తాపడం చేయించేందుకు విరాళాలు వస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డి దాదాపుగా ఏడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.3.10 కోట్లు విరాళంగా అందించారు. సోమవారం యాదాద్రి ఆలయంలో ఆలయ ఈవో గీతకు ఈ ఈ చెక్కు అందించారు. తొలి విడతలో అక్టోబర్ 28న మూడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.1.83 కోట్లు విరాళం అందజేసిన సంగతి తెలిసిందే.

మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు

నేడు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సివిల్ సప్లై భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని కనీసం సిలిండర్ కు 200 రూపాయల సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సివిల్ సప్లయ్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా కు వెళ్తున్న మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

అనంతపురంలో విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జి

విద్యార్థి సంఘాలు అనంతపురంలో ఆందోళన బాట పట్టాయి. ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్ల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్ఎస్‌బీఎన్ కాలేజీ, స్కూల్ విలీన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యార్థులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. యాజమాన్యం ఇప్పటికే విలీనానికి అంగీకరించింది. దీంతో నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో తోపులాటలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కొంత మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనుమానాస్పద స్థితిలో యువతి శవం

హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమాస్పద స్థితిలో ఓ యువతి శవం వెలుగులోకి వచ్చింది. ఒంటిపై బట్టలు లేకుండా యువతి మృతదేహం నగ్నంగా పడి ఉంది. ఆమెది అత్యాచారమా లేక గ్యాంగ్ రేపా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. యువతి ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆమె అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేపడుతున్నారు. మృతి చెందిన యువతి డ్యాన్సర్‌ అని పోలీసులు గుర్తించారు.

ఏపీ రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు ఈరోజు విరామం

రాజధానిగా అమరాతినే ఉండాలని ఏపీ రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు ఈరోజు విరామం ఇచ్చారు. కార్తీక సోమవారం, నాగులచవితి పండుగ కావటంతో నేటి పాదయాత్ర షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ఇప్పటి వరకూ అమరావతి రైతుల బృందం ఏడు రోజుల పాటు 96.3 కిలోమీటర్ల మేర నడిచి ఇంకొల్లుకు చేరుకుంది. పాదయాత్ర నిర్వాహకులు నేడు విరామాన్ని ప్రకటించారు.  రేపటి నుండి యథావిధిగా మహాపాదయాత్ర కొనసాగనుందని తెలిపారు. 

Background

తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా మారాయిగూడెం లింగం పల్లి బేస్ క్యాంప్‌లో కాల్పులు కలకలం రేపాయి. తోటి జవాన్లపై మరో జవాన్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులని భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులలో మృతి చెందిన వారు రాజమణి యాదవ్, ధాంజీ, రాజీవ్ మండల్ వీరిలో రాజీవ్ మండల్ వెస్ట్ బెంగాల్‌కు చెందినవాడు కాగా, మరో ఇద్దరు బీహార్‌కి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఎందుకు జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Also Read: పన్ను కట్టేందుకు డబ్బు లేదు! షేర్లు అమ్మేసుకోనా అంటూ ట్విటర్లో మస్క్‌ పోల్‌


టీఆర్ఎస్ కార్పొరేటర్ కన్నుమూత


టీఆర్ఎస్ నాయకురాలు, జవహార్ నగర్ కార్పొరేటర్ విశ్రాంతమ్మ (55) మృతి చెందారు. గత 8 నెలలుగా ఆమె కేన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆమె భర్త రాబర్ట్‌, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లోని ప్రకాశం జిల్లా నుంచి 35 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లోని జవహర్‌ నగర్‌కు వలస వచ్చి స్థిరపడ్డారు. వార్డు మెంబర్‌గా రాజకీయ ఆరంగ్రేటం చేసిన ఆమె.. గత ఎన్నికల్లో జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో స్వంతంత్ర అభ్యర్థిగా గెలిచారు. తర్వాత మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ కావ్య, డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌, కార్పొరేటర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు తదితరులు విశ్రాంతమ్మ పార్థీవదేహానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.


Also Read: Telangana CM KCR ఢిల్లీలో ప్రధాని మోదీకి గులాంగిరీ.. ఇప్పుడు పోరాటమంటూ చెవుల్లో పూలు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి


వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు


హైదరాబాద్‌లోని బౌద్ధ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై ఆదివారం చిలకలగూడ పోలీసులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన రేచల్‌ సోఫియా (50) అనే మహిళ నెల రోజుల క్రితం ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. పద్మారావునగర్‌ ఏషియన్‌ వైన్స్‌లో పనిచేసే అప్పల అనిల్‌ (22) సహకారంతో అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. దీంతో ఆ గృహంపై దాడి చేసి పోలీసులు ఓ యువతికి విముక్తి కల్పించారు. ఓ విటుడిని కూడా అరెస్ట్‌ చేశారు.


Also Read:  పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకపోతే ప్రజలకే కాదు ప్రభుత్వానికీ నష్టమే..! ఎలాగో తెలుసా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.