Breaking Updates Live: తెలంగాణలో కొత్తగా 245 పాజిటివ్‌ కేసులు.. జీహెచ్ఎంసీలో 73 మందికి కరోనా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 29న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 29 Sep 2021 08:10 PM
తెలంగాణలో కొత్తగా 245 పాజిటివ్‌ కేసులు.. జీహెచ్ఎంసీలో 73 మందికి కరోనా

తెలంగాణలో 52,683 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 245 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 73 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 6,65,749కు చేరింది. అందులో 6,57,213 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో తాజాగా ఒకరు చనిపోగా, మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,916కు చేరింది.

ఆ క్రిమినల్ గ్యాంగ్‌లపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి: తెలంగాణ డీజీపీ

సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నేరస్తుల ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించి, వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారు, అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై పి.డి. యాక్టులు నమోదు చేసి నిందుతులకు శిక్ష పడేలా కఠినంగా వ్యవహరించాలని డీజీపీ సూచించారు.

తెలంగాణ పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

తెలంగాణలోని ఇంజనీరింగ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (పీజీఈసెట్‌) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు 1న పీజీఈసెట్ అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. ధ్రువపత్రాల పరిశీలన ఆన్‌లైన్‌లో జరుగుతుందని అధికారులు వెల్లడించారు. అక్టోబరు 4 నుంచి 18 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంటెక్‌లో 83 కాలేజీల్లో మొత్తం 6,437 కన్వీనర్ కోటా సీట్లు.. ఎంఫార్మసీలో 101 కాలేజీల్లో 3,593 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఫార్మ్ డీలో మొత్తం 25 కాలేజీల్లో 250 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నట్లు చెప్పారు. ఎంఆర్క్‌లో 7 కాలేజీలకుగాను 200 సీట్లు ఉన్నాయని వివరించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పీజీఈసెట్, గేట్‌లో 17,628 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే. వీరంతా త్వరలో జరగబోయే కౌన్సెలింగ్‌కు హాజరుకానున్నారు. 

ఎస్‌వీయూలో డిగ్రీ ప్రశ్నపత్రం లీక్.. సోషల్ మీడియాలో వైరల్‌

చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వర్సిటీ (ఎస్‌వీయూ) పరిధిలో డిగ్రీ ప్రశ్నపత్రం లీకేజీ కలకలం రేపింది. జిల్లాలోని మదనపల్లెలో బీకాం ఆరో సెమిస్టర్‌ మేనేజింగ్‌ అకౌంటింగ్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకైంది. ఇవాళ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు మేనేజింగ్‌ అకౌంటింగ్‌ పరీక్ష జరగాల్సి ఉంది. ఇవాళ ఉదయం 11.42 గంటలకే లీకైన ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఎస్‌వీయూ పరిధిలో ఈ నెల 23 నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. వర్సిటీ పరిధిలోని 112 కాలేజీల్లో పరీక్షలు జరుగుతుండగా.. 73 వేల మంది పరీక్షలు రాస్తున్నారు. వారిలో 25 వేల మంది ఫైనలియర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. 

ఇకనుంచి భయం అంటే ఏంటో వైసీసీ నేతలకు చూపిస్తా.. మంగళగిరిలో పవన్ కళ్యాణ్

మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ మంత్రులు, వైసీపీ నేతల తీరును విమర్శించారు. ‘ఆడబిడ్డలకు నేను చాలా గౌరవం ఇస్తాను. నేనుప్పుడు హద్దులు దాటి మాట్లాడలేదు. నా తల్లితండ్రులు ఆ సంస్కారాన్ని నేర్పించారు. ఇకనుంచి భయం అంటే ఏంటో వైసీసీ నేతలకు చూపిస్తా. రివర్స్ టెండరింగ్ గురించి అడిగితే వ్యక్తిగత జీవితం గురించి తీస్తారెందుకు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడుందని’ పవన్ ప్రశ్నించారు. 

మచిలీపట్నంలో సినీ నిర్మాతల సమావేశం

మచిలీపట్నంలో సినీ నిర్మాతలు మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. ఆన్ లైన్ టికెట్స్ రేట్లు, ఇతర సినీ సమస్యలను మంత్రితో వారు చర్చించనున్నారు. మంత్రిని కలిసిన వారిలో నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య సహా తదితరులు ఉన్నారు.

పాలిసెట్ 2021 అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

పాలిసెట్ 2021 అడ్మిషన్లకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్‌లైన్ ద్వారా పాలిసెట్ 2021 అడ్మిషన్లు అక్టోబర్ 1 నుంచి 6 వరకూ ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించనున్నారు. అక్టోబర్ 3 నుoచి 7వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. అక్టోబర్ 3 నుoచి 8 వరకు ఆప్షన్ల ఎంపిక, అక్టోబర్ 11న సీట్ల కేటాయింపు, అక్టోబర్ 18 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 257 కళాశాలు ఉన్నాయి. 70,427 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

నిజామాబాద్: యువతిపై సామూహిక అత్యాచారం

నిజామాబాద్ నగరంలో యువతిపై మరో దారుణం చోటు చేసుకుంది. ఓ అమ్మాయికి యువకులు బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నలుగురు వ్యక్తులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత యువతిని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితులు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం వెతుకుతున్నారు.

వరదలో కొట్టుకొచ్చిన మృతదేహం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల శాంతినగర్ బైపాస్ వద్ద వరద ప్రవాహంలో ఓ మృతదేహం కొట్టుకొని వచ్చింది. శాంతినగర్‌కు చెందిన ఎర్రగుంట కిషన్ అనే 32 ఏళ్ల వ్యక్తిగా ఈయన్ని గుర్తించారు. ఈ శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 29న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.