ACB Officers Caught Tribal Welfare Executive Engineer In Masab Tank: ఓ ప్రభుత్వ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ (Hyderabad) మాసబ్ ట్యాంక్ లోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తోన్న జగ జ్యోతి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అనంతరం పక్కా ప్రణాళికతో డబ్బు తీసుకుంటుండగా ఆమెను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అధికారులు పట్టుకున్న అనంతరం ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె కార్యాలయంతో పాటు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. జగ జ్యోతిని కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.


కాగా, ఇటీవలే నల్గొండ (Nalgonda) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి సూపరింటెండెంట్ లచ్చునాయక్ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. పక్కా ప్లాన్ తో వెంకన్న నుంచి లచ్చునాయక్ ఆయన నివాసంలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట తహసీల్దార్ ను సైతం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టాదార్ పాస్ బుక్ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి తహసీల్దార్ సత్యనారాయణ లంచం డిమాండ్ చేయగా.. బాధితుని ఫిర్యాదుతో పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు ఆ అధికారి పని పట్టారు. ఎమ్మార్వో డ్రైవర్ రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్వో తీసుకోమంటేనే తాను డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్ అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 


Also Read: Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్