Margadarsi Supreme Court  :  మార్గదర్శి కేసులో  ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీకి కేసుల బదిలీకి సుప్రీంకోర్టు నిరాకరించింది.  
మార్గదర్శి కేసులను విచారించే న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుక లేదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను  సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. న్యాయపరిధి విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని  సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటీషన్లు కాలం చెల్లినవని చెప్పిన సుప్రీంకోర్టు ...మార్గదర్శి ఎండి శైలజాకిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.  


మెరిట్స్ ఆధారంగా ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టుకు సూచన                                    


మెరిట్స్ ఆధారంగా ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలన్న జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ఆధారంగా కేసును విచారించి తీర్పును వెలువరించే స్వేచ్ఛను తెలంగాణ హైకోర్టుకే  ఇచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసు బదిలీపై ఏపీ ప్రభుత్వం పిటిషన్లపై విచారణ అవసరం లేదని..  విచారణ నిర్ణయం ఇప్పటికే జరిగినందున మళ్లీ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.  చెప్పాలనుకున్న విషయాలన్నీ తెలంగాణ హైకోర్టు ముందు చెప్పండని ఏపీ న్యాయవాదులకు సూచించింది.  తెలంగాణ హైకోర్టు తుది ఆదేశాలు ఇచ్చాక రావచ్చని సుప్రీంకోర్టు ఏపీ న్యాయవాదులకు స్పష్టం చేసింది. 


చిట్స్ సొమ్ము దారి మళ్లించారని ఏపీ ప్రభుత్వం  వాదన                                                
  
వాదనల సందర్భంగా  చిట్ ఫండ్ పేరుతో నిధులను సేకరించి దారి మళ్ళించారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏపీ ప్రభుత్వ న్యాయవాది. అలాగే.. ఆంధ్రప్రదేశ్ లోనే నేరం జరిగిందని, కాబట్టి.. కేసులన్నింటినీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని వాదించారు.  చిట్ ఫండ్ నిధులను హైదరాబాదు నుంచి మ్యూచువల్ ఫండ్ లోకి తరలించారని వాదించారు మార్గదర్శి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి. కాజ్ ఆఫ్ యాక్షన్ హైదరాబాద్ లోనే ఉంది కనుక తెలంగాణలోనే విచారణ జరపాలని వాదించారు.చివరికి ఏపీ ప్రభుత్వ పిటిషన్లను ధర్మాసనం తోసిపుచ్చింది. 


మార్గదర్శి విషయంలో దూకుడుగా ఏపీ ప్రభుత్వం                                      


మార్గదర్శి చిట్ పండ్స్ కేసుల విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒక్క ఫిర్యాదుదారు లేనప్పటికీ సంస్థ అవకతవకలకు పాల్పడుతోందని నగదు మళ్లిస్తోందని ఆరోపిస్తూ.. సోదాలు నిర్వహించారు. అలాగే చిట్స్ ను మూసేయడానికి  .. చందాదారులకు బహిరంగనోటీసులు జారీ చేశారు.  రాజకీయంగా కుట్ర చేసి వ్యాపార సంస్థను మూసి వేయడానికి జరుగుతున్న కుట్రగా మార్గదర్శి ఆరోపిస్తోంది.