Supreme Court Dismissed KTR Petition: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు (KTR) సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. కాగా, ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో ఇటీవలే పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించగా.. ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా విచారించిన సుప్రీంకోర్టు కొట్టేసింది. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది. మరోవైపు, ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.


కేటీఆర్ పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని.. ప్రస్తుతం కేటీఆర్ విపక్షంలో ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది సుందరం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఉడడంతోనే కేసులు పెడుతున్నారని వాదించారు. అయితే, 'ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా..?' అని జస్టిస్ బేలా ఎం.త్రివేది ప్రశ్నించారు. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.


'ఆ ఆదేశాలు ఇవ్వలేం'


అయితే, పిటిషన్‌ను వెనక్కి తీసుకుని.. మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరారు. పిటిషన్‌ను విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించిన ధర్మాసనం.. మళ్లీ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఇవ్వలేమని తెలిపారు. దీంతో పిటిషన్ ఉపసంహరించుకుంటామని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.


అసలేంటీ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం


బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఏసీబీ గతేడాది అక్టోబర్ 18న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ వ్యవహారం జరగడంతో గవర్నర్ అనుమతితో ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. కేటీఆర్‌ను ఏ1గా, పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఏ2గా, హెచ్ఎండీఏ అప్పటి చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏ3గా ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. 


త్వరలో రెండో విడత నోటీసులు


ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్‌ను విచారించిన ఏసీబీ మలి విడత విచారణకూ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ నెల 16 తర్వాత నోటీసులిచ్చేందుకు కసరత్తు చేస్తోంది. రేస్ నిర్వహణలో తొలి ప్రమోటర్‌గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ వ్యవహారంపైనా దృష్టి సారించింది.


Also Read: Crime News: పుప్పాలగూడ డబుల్ మర్డర్ కేసు - మృతులను గుర్తించిన పోలీసులు, దారుణ హత్యలకు కారణం అదేనా?