టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కలిశారు. హైదరాబాద్‌కి వచ్చిన రజనీకాంత్ చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు వీరు కలిసి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే రజినీకాంత్ చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనే అని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు కూడా తన ట్విటర్ లో తన స్నేహితుడు రజనీకాంత్‌ని ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ ట్వీట్ చేశారు. రజనీకాంత్‌ని శాలువాతో సత్కరిస్తున్న ఫొటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






రజినీ కాంత్ కూడా చంద్రబాబును కలవడంపై ఇలా ట్వీట్ చేశారు. ‘‘చాలా కాలం తర్వాత నా ప్రియ మిత్రుడు చంద్రబాబు నాయుడును కలిశాను. మరపురాని సమయాన్ని గడిపాను. ఆయన మంచి ఆరోగ్యంతో పాటు రాజకీయ జీవితంలో గొప్ప విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని రజినీకాంత్ ట్వీట్ చేశారు.






సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించటమే కాకుండా పార్టీ పేరును ప్రకటించి రిజిస్టర్ చేయించారు. కానీ, ఆయన ఆరోగ్య కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని వెనక్కి తగ్గారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుకు జరిగిన ఘటన సమయంలో ఫోన్ చేసి మరీ రజినీ కాంత్ పరామర్శించారు. ఇక ఇప్పుడు నేరుగా వచ్చి చంద్రబాబును కలిశారు.