Sukesh Chandrasekhar wrote a letter to Kavitha from Tihar Jail :  ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయిన కవితకు మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో  ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఓ లేఖ రాశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్షసాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలేనని కవిత అరెస్టుతో తేలిందని అన్నారు. నిజం బయటికొచ్చిందని.. చేసిన పనుల కర్మ ఫలం ఇప్పుడూ వెంటాడుతోందని అన్నారు. నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఎదుర్కోవాల్సి ఉంటుంది. నన్ను ఎవరూ ఏమి చేయలేరని అనుకునేవారు. కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైందని లేఖలో చెప్పుకొచ్చారు. 


తాను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో 2 అంశాలు పొందుపరిచాననని..   అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుందని.. రెండోది తిహార్ క్లబ్‌లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైందని అని గుర్తు చేశారు.  ఈ రెండూ ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తోందన్నారు.  కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయని జోస్ం చెప్పారు.  వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంగ్‌కాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు బయటికొస్తాయి. ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నానని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.                  


కవితను అక్కా అని సంబోధిస్తూ సుఖేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.   నేను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి. బయటపడే మార్గమే లేదు అక్కా. ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే.. అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు, న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి. ఇందుకు కావాల్సినంత సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసారు.                     


 ఈడీ, సీబీఐ కన్‌ఫ్రంటేషన్‌లో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖి చూస్తాననని సుఖేష్ లేఖలో చెప్పుకొచ్చారు.  మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్కా. మీ మరో సోదరుడు, అవితిని సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్‌లో లగ్జరీ జీవితం అందంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. ఈ లేఖను ముగించే ముందు మరొక్క మాట చెప్పదల్చుకున్నా.. సినిమా ఇంకా మిగిలే ఉంది. కేజ్రీవాల్ జీ.. తదుపరి ఇక మీరే. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది. కేజ్రీవాల్ జీ.. నా సోదరసోదరీమణులకు తిహార్ క్లబ్‌కు స్వాగతం పలుకుతున్నాను.' అని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు.జైలు నుంచి ఆయన రాసిన లేఖను సుఖేష్ లాయర్ మీడియాకు విడుదల చేశారు.