హైదరాబాద్‌: గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించిన పలు నియామక పరీక్షల పేపర్ల లీకేజీ సంచలనం కావడం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రూప్స్ పేపర్ తో పాటు ఇతర జాబ్ ఎగ్జామ్ పేపర్ల లీకులపై విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసులో ఇదివరకే 109 మంది అరెస్ట్ కాగా, మరిన్ని అరెస్టులు కొనసాగుతాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదనపు కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. పేపర్ లీకేజీ చిన్న విషయం కాదని, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామన్నారు. కమిషన్‌ కస్టోడియన్‌ శంకరలక్ష్మిని గతంలోనే విచారించినట్లు చెప్పారు. కేసులో కొన్ని మిస్సింగ్‌ లింక్స్‌ ఉన్నాయని, త్వరలోనే కేసు దర్యాప్తు పూర్తి చేసి మీడియాకు విషయాలు వెల్లడిస్తాం అన్నారు.