SIT Notice To Revant Reddy  :    టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రేవంత్ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పేపర్ లీక్ అంశంపై రేవంత్ రెడ్డి తీవ్రర ఆరోపణలు చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశం కేటీఆర్ కు తెలుసని కథ మొత్తం   పీఏ   తిరుపతి నడిపించారని  రేవంత్ రెడ్డి ఆరోపింస్తున్నారు.  మంత్రి కేటీఆర్ పేషీనే అన్ని వ్యవహారాలు నడిపిందని, ఏ విచారణ జరిపినా కేటీఆర్ పేషీ నుంచే మూలాలు బయటపడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.


వంద మార్కులు వచ్చిన  వారి వివరాలు బయట పెట్టాలన్న రేవంత్ 


లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజశేఖర్, కేటీఆర్ పీఏ తిరుపతి ఊర్లు పక్కపక్కనే ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ పీఏ, రాజశేఖర్ ల సన్నిహితులకు మాత్రమే గ్రూపు 1 లో అత్యధిక మార్కులు వచ్చాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గ్రూప్ 1లో 100కు పైగా మార్కులు వచ్చిన అందరి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ తిరుపతి సూచన మేరకే.. రాజశేఖర్ కు టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించి రాజశేఖర్ ను టీఎస్పీఎస్సీకి పంపించారని అన్నారు.


పలు కీలక ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి 


అక్కడ పనిచేస్తూ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. గతంలో టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ గ్రూప్ 1 పరీక్ష రాసిన.. మాధురికి ఒకటో ర్యాంక్, రజనీకాంత్ కు 4వ ర్యాంకులు వచ్చాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేసే 20 మందికి పైగా ఉద్యోగులకు పరీక్షలు రాసేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇవ్వటం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి పోటీ పరీక్షలు రాయాలనుకుంటే, టీఎస్పీఎస్సీలో పనిచేసే వారు ఇతర శాఖలకు బదీలీ చేసుకోవాలని అన్నారు. లేదా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రయత్నించాలని అన్నారు. లేదంటే లాంగ్ లీవ్ పైన వెళ్లాలని అన్నారు. ఇలా చేస్తేనే పోటీ పరీక్షలకు రాసేందుకు అర్హత ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. టీఎస్పీఎస్సీలోనే పనిచేసే 20 మంది పరీక్షలు రాశారని అన్నారు.ఈ వివరాలన్నింటికీ ఆధారాలు కావాలని సిట్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే విపక్షాలకు చెందిన ఇతర పార్టీల నేతలకు కూడా సిట్ నోటీసులు జారీ చేయవచ్చని భావిస్తున్నారు.  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వీటికి సంబంధించిన వివరాలు, ఆధారాలు ఇవ్వాలని సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 


సిట్ నోటీసులు అందలేదన్న రేవంత్ రెడ్డి  


సిట్ నోటీసులు తనకు ఇంకా అందలేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు.  సిట్ నోటీసులకు బయపడేది లేదని మా దగ్గర ఉన్న ఆదారాలను సిట్ కు ఇవ్వబోమని ప్రకటించారు.  సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేయిస్తే ఇస్తామన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా ఉంటామని TSPSC పేపర్ లీకేజ్ బాగోతం బయటపడాలంటే సిట్టింగ్ జడ్జ్ తోనే విచారణ జరిపించాలని  రేవంత్ డిమాండ్ చేశారు.  కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగేదాక మా పోరాటం కొనసాగుతుందన్నారు.  కేసును కావాలనే నీరుగారుస్తున్నారని ఆరోపించారు.