TSPSC Updates :    TSPSC పేపర్ లీకేజీ కేసులో  బోర్డు చైర్మన్, సభ్యులను కూడా ప్రశ్నించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయించుకుంది.  బోర్డు సెక్రెటరీ, సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంపై TSPSC మెంబర్లను విచారించనుంది. ఈ విచారణలో ఆరుగురు బోర్డు సభ్యుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు సిట్ అధికారులు. బోర్డు సభ్యులు సుమిత్రా ఆనంద్ తనోబా, కరమ రవిందర్ రెడ్డి, ఆర్ సత్యనారయణ, రమావత్ ధన్ సింగ్, బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి లను సిట్ విచారించనుంది. బోర్డు సెక్రటరీ అనితా రామచంద్రన్‌కు కూడా నోటీసులు జారీ చేశారు.  ఏ - 1గా ఉన్న ప్రవీణ్ అనితా రామచంద్రన్ పీఏగా పని చేస్తున్నారు. 


గ్రూప్‌-1 ప్రశ్నపత్రం లీకేజీలో నిందితులుగా ఉన్న ఇద్దరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు షమీమ్‌, రమేశ్‌తో పాటు మాజీ ఉద్యోగి సురేశ్‌లను విచారించి పేపర్‌ లీకేజీతో ఇంకా ఎంత మందికి సంబంధం ఉందనే విషయాన్ని తేల్చాలని సిట్‌ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో నిందితులను 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ముగ్గురు నిందితులు షమీమ్‌, రమేశ్‌, సురేశ్‌లను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.  తమతో ఉన్న పరిచయం కొద్దీ ప్రవీణ్‌ ప్రశ్నపత్రం ఇచ్చాడని, దాన్ని వాట్సా‌ప్‌లో షేర్‌ చేశాడని, తాము ఇతరులెవరికీ ఇవ్వలేదని షమీమ్‌, సురేశ్‌లు సమాధానం చెప్పినట్లు తెలిసింది. రాజశేఖర్‌తో ఉన్న స్నేహం కారణంగానే తనకు ప్రశ్నపత్రం ఇచ్చాడని రమేశ్‌ చెప్పినట్లు సమాచారం.


ఇప్పటి వరకు ఏఈ పేపర్లు 12 మందికి, గ్రూప్‌-1 పేపర్లు ఐదుగురికి లీకైనట్లు ప్రాథమికంగా నిర్థారించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 15కు చేరింది. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌రెడ్డితో కలిసి నిందితుల సంఖ్య 16కు చేరింది. లీకేజీ విషయం టీఎస్‌పీఎస్సీలో ఇంకా ఎంతమంది ఉద్యోగులకు తెలుసన్న కోణంలో సిట్‌ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఏఈ పేపర్‌ లీకేజీకి సంబంధించిన నలుగురు నిందితుల కస్టడీ మంగళవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. వారిని విచారించిన క్రమంలో పలు ఆసక్తికర విషయాలు తెలిసినట్లు సమాచారం. పేపర్‌ను కొన్న వారంతా అప్పులు చేసి, ఆస్తులు కుదువ పెట్టి.. రేణుక భర్త ఢాక్యా నాయక్‌, ఆమె తమ్ముడు రాజేశ్వర్‌కు డబ్బులిచ్చామని చెప్పినట్లు తెలిసింది.


మరో వైపు ఈ పేపర్ల లీకేజీ కేసులో సిట్ ఎటూ తేల్చడం లేదని.. నిందితుల్ని కాపాడేందుకే ప్రయత్నిస్తోందని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కోర్టుకు నివేదిక సమర్పించక ముందే కేటీఆర్‌కు ఎలా వివరాలు తెలుస్తున్నాయని  టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. అయితే తమ నివేదికను నేరుగా కోర్టుకే సమర్పిస్తామని .. ఎవరికీ లీక్ చేయలేదని సిట్ స్పష్టం చేసింది.   బండి సంజయ్‌కు జారీ చేసిన నోటీసుల అంశంపై సిట్ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు. రెండు సార్లు నోటీసులు జారీ చేసినా బండి సంజయ్ విచారణకు హాజరు కాలేదు.