Telangana News: తెలంగాణలో సంచలనం రేపిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్, హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం  కేసులో అరెస్ట్ అయిన ఆయనను ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఈ ఏడు రోజుల పాటు ప్రణీత్ రావును సిట్ పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ నెల 13న కోర్టుకు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. ఈ రిపోర్టులో కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలు పొందుపర్చారు. 42 హార్డ్‌డిస్క్‌లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారని, అతడికి మరికొంతమంది సహకరించినట్లు పోలీసులు తేల్చారు.


తనకు అప్పగించిన పనే కాకుండా ఇతరుల ఫైళ్లను కూడా రహస్యంగా ప్రణీత్ రావు తయారుచేశారని, అత్యంత గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని కూడా తన పర్సనల్ పెన్‌డ్రైవుల్లోకి ఎక్కించుకున్నాడని గుర్తించారు. ఎన్నికలు ఫలితాలు విడుదలైన రోజే ఈ పని చేశారని, తన బాగోతం బయటపడకుండా సీసీ కెమెరాలను కూడా ఆఫ్ చేసినట్లు విచారణలో తేలింది. ప్రణీత్ రావు కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో స్పెషల్ టీమ్ ఇప్పటికే ప్రణీత్ రావు పనిచేసిన ఛాంబర్‌ను పరిశీలించింది. అక్కడ పనిచేసిన ఎలక్ట్రీషియన్‌ను కూడా విచారించారు.  ఎలక్ట్రీషియన్ సాయంతోనే హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు గుర్తించారు.


రహస్య డేటా ఏముంది?


ఇక ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన అధికారులను కూడా దర్యాప్తు బృందం విచారించేందుకు సిద్దమవుతోంది. వారిని విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది. అసలు హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయాల్సి వచ్చిందంటే.. అందులో రహస్య డేటా ఏముందనే దానిపై ఆరా తీయనున్నారు. అలాగే ప్రణీత్ రావు వద్ద నుంచి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని డేటాను సేకరించేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ కోసం పంపించారు. ఆ రిపోర్ట్ వస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ 4న  ప్రణీత్ రావు స్విచ్ ఆఫ్ చేయకముందు, తర్వాతి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.


ప్రణీత్ రావు వ్యవహారం ఎలా బయటకొచ్చింది?


తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ప్రణీత్ రావుపై ఓ వ్యాపారవేత్త పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మూడు రకాల పాల్పడినట్లు గుర్తించారు.  ప్రజా ఆస్తుల ధ్వంసం, సాక్ష్యాల చెరిపివేత, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ వంటి నేరాలకు పాల్పడినందుకు ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ఈ పని చేసినట్లు విచారణలో ప్రణీత్ రావు బయటపెట్టాడు. దీంతో ఆదేశాలు ఎవరు ఇచ్చారనే దానిపై కూడా విచారణ చేపడుతున్నారు.  ప్రణీత్ రావు కేసును కాంగ్రెస్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. దీంతో పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్త చేపడుతున్నారు. ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకోవడంతో మరిన్ని వివరాలు సేకరించనున్నారు.