Sharmila  :   వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో షర్మిల రాజకీయాలు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై  వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో పరోక్షంగా స్పందించారు. ఏపీకి వెళ్లే ప్రశ్నే లేదని తన స్పందన ద్వారా తేల్చి చెప్పారు.  వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటుందన్నారు.  ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటనని.. తన రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టాలని సూచించారు.  అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనే, నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమేనని స్పష్టం చేశారు.  





 కాంగ్రెస్ లో విలీన వార్తను షర్మిల తన ప్రకటనలో ఖండించలేదు. కేవలం తాను ఏపీలో రాజకీయాలు చేస్తారని జరుగుతున్న ప్రచారాన్నే పరోక్షంగా ఖండించారు. తాను తెలంగాణలోనే ఉంటానంటున్నారు. వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఆమె రాజకీయాలు చేయాల్సి వస్తే విలీనం అవసరం లేదని రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ గా వెళ్లాలంటున్నారు. రేవంత్‌తో పాటు ఎక్కువ మంది ఆమె ఎపీ కాంగ్రెస్ లో అయితే ఉపయోగం అని విశ్లేషిస్తున్నారు. కానీ షర్మిల మాత్రం తెలంగాణలోనే రాజకీయం చేస్తానంటున్నారు.   


షర్మిల పార్టీ పెట్టిన తర్వాత ఎ ఎన్నికలనూ పోటీ చేయలేదు. కొన్ని ఉపఎన్నికలు వచ్చినా సైలెంట్ గానే ఉన్నారు.  మొదట్లో షర్మిల బీజేపీ వదిలిన బాణం అనుకున్నారు.  కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత అందరితో పాటు ఆమె కూడా మారిపోయారు. నిజానికి అందరి కంటే వేగంగాఆమె స్పందించారు. ఇలా ఫలితాలు వస్తున్న సమయంలోనే బెంగళూరులో   డీకే శివకుమార్ తో సమావేశం అయ్యారు. తన సమావేశం గురించి తానే స్వయంగా బయట పెట్టారు. తర్వాత శివకుమార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరోసారి కలిశారు. శివకుమార్ కు వచ్చే ఎన్నికల్లో దక్షిణాది  తరపున కాంగ్రెస్ బాధ్యతలు ఇస్తున్నట్లుగా ప్రచారం జరగడంతో..  షర్మిల ప్రయత్నం అంతా కాంగ్రెస్ పార్టీతో జత కట్టడానికేనన్న వాదన బలపడింది.  


ఇటీవల రాహుల్ గాంధీ పుట్టిన రోజు నాడు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో విలీనం ఖాయమయిందని చెబుతున్నారు. వైఎస్ జయంతి రోజున ఇడుపుల పాయలో  సోనియా, రాహుల్ నివాళులు అర్పించిన తర్వాత విలీన ప్రకటన చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆమె ఏపీ రాజకీయాల్లోకి వెళ్తే కీలక మార్పులు ఉంటాయని విశ్లేషణలు వస్తూండటంతో.. తన రాజకీయం తెలంగాణలోనేనని ఆమె చెబుతున్నారు. 




Join Us on Telegram: https://t.me/abpdesamofficial