ఎవరి కోసమో పార్టీ విధానాలను మార్చుకోదని, గత 35 గా పార్టీ ఎలా ఉందో అలాగనే నడుస్తుందని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ అన్నారు. బీజేపీ రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ... "పార్టీలో ఉండేవారు ఉంటారు... పోయేవారు పోతారు... అనవసర మాటలు తగ్గించండి... తప్పుడు ప్రచారాలు నమ్మకండి... మోడీ కేసీఆర్ కలిసి ఉంటే ఈ కార్యక్రమాలు ఎందుకు?" అంటూ బీఎల్ సంతోష్ వ్యాఖ్యానించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఆయన విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ పై జనంలో వ్యతిరేకత నెలకొందని, దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రధాన బలహీనత అహంకారమేనని చెప్పారు. అటువంటి అహంకారం బీజేపీ లో ఉండదని చెప్పారు. అహంకారం ఎక్కువ అయ్యే కొద్ది పతనం మొదలవుతుందని త్వరలో ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెబుతారని అన్నారు. పార్టీ నేతలు నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.   కేవలం ఎన్నికల సమయానికో, పబ్లిక్ మీటింగ్ లకు పరిమితం కావద్దని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని తెలిపారు.


కొత్త పాత తేడాలు పక్కన పెట్టాలని రాబోయే రోజుల్లో చాలా ముఖ్య నాయకులు కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీలో పని చేసే వారికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో బిజెపి చేస్తున్న పనులు, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఉత్తరప్రదేశ్లో ముగ్గురు దళిత మహిళలను మంత్రులను చేశామని విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. తెలంగాణలో సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ చూస్తోందని, కార్యకర్తలు ఎవరు భయపడకుండా ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించాలని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన సీఎంగా చేసేది తెలంగాణకు చెందినవారినేనని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని కోరారు.


తెలంగాణలో బీజేపీ పై సానుకూల వాతావరణం ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని భావన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉందని వెల్లడించారు. అవినీతి కుటుంబాన్ని ఎప్పుడు జైల్లో వేస్తున్నారనే   ప్రశ్నలు ప్రజల్లో నుంచి వస్తున్నాయని బిఎల్ సంతోష్ స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో సర్వేలు చేయించుకొని భయపడుతున్నారని చెప్పారు. 


రాష్ట్ర నాయకులు స్థానికంగా ఉన్న సమస్యను స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రిల దృష్టికి తీసుకువచ్చేలా కృషి చేయాలని చెప్పారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి వెంటనే వాటిపై ఉద్యమాలు చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు. రాష్ట్రంలో బిజెపిపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందని, ఎక్కడికి వెళ్లిన జనం విశేషంగా ఆదరిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారు రావాలని కోరుకుంటున్నారని ఇందుకు అందరూ కష్టపడాలని సూచించారు.